మోడల్ మార్కెట్లో అక్రమాల జాతర!
రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థలాల్లోనూ అమ్మకం
చైర్ పర్సన్ ఆదేశాలకు వ్యాపారుల మంగళం
ఫోన్ కాల్ తో ఆగిపోయిన తొలగింపు
నాయకుల గుప్పిట్లో మార్కెట్!
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం కట్టిన మోడల్ మార్కెట్.. నేడు కొందరి జేబులు నింపే బోడి మార్కెట్ గా మారింది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక హంగులతో 91 కమిషన్ షాపులు, 30 కమర్షియల్ షట్టర్లు, 158 మడిగలు, విశాలమైన పార్కింగ్ తో నిర్మించిన లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఇప్పుడు పూర్తిగా అక్రమార్కుల చేతిలో చిక్కుకుంది. మొదటి దోపిడీ పార్కింగ్ స్థలంలోనే మొదలైంది. వాహనాల కోసం కేటాయించిన విలువైన స్థలాన్ని అధికారుల అండదండలతో ఓపెన్ ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. ఆ ప్లాట్లను ఎవరో బయటి వారు కాదు.. ఇదే మార్కెట్ లోని కమిషన్ వ్యాపారులే కొట్టేసినట్లు బహిరంగ రహస్యం. ఇది చాలదన్నట్లు తమ షాపుల ముందున్న ప్రభుత్వ స్థలాన్ని సైతం ఆక్రమించి నెలకు వేలల్లో కిరాయిలకు ఇస్తూ దందా చేస్తున్నారు. అధికారులు కళ్లుండి చూడలేని గుడ్డివాళ్లయ్యారా? అన్నది ప్రజల ప్రశ్న.


రోడ్డే దుకాణం.. రోడ్డే గోడౌన్!
అసలు నరకం మార్కెట్ బయట. రోడ్లకు ఇరువైపులా ఇష్టానుసారంగా తడకలు, టెంట్లు నాటేసి రోడ్డునే దుకాణంగా మార్చేశారు. రోడ్డు మీదనే లారీలు, ఆటోలు నిలిపేసి సరుకు దించుతున్నారు. దీంతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ జామ్. కూరగాయలు కొనడానికి వచ్చే మహిళలు, వృద్ధులు, వాహనదారులు నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. రోడ్డుపై వెళ్లలేని దుస్థితి.
ఈ దుస్థితి సామాన్యుడికే కాదు.. సాక్షాత్తు వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ యెర్ర ప్రియాంక, డీఎంఓ నాగరాజు, డీడీఎం పద్మావతి లకే ఎదురైంది. ఇటీవల చైర్ పర్సన్ యెర్ర ప్రియాంక అనిల్ వాహనం కూడా ఈ తడకల జామ్ లో చిక్కుకుంది. దీంతో ఆగ్రహించిన చైర్ పర్సన్ వెంటనే రోడ్లపై తడకలు తొలగించాలని అధికారులపై మండిపడ్డారు. చైర్ పర్సన్ ఆదేశంతో అధికారులు హడావుడిగా తడకల తొలగింపుకు రంగం సిద్ధం చేశారు. వ్యాపారులకు ఫోన్లు చేసి తొలగించుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్. మార్కెట్ లోకి రాజకీయం ఎంటర్ అయింది. కొందరు స్థానిక నాయకుల నుండి అధికారులకు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. “అప్పుడే తొలగిస్తే వాళ్లు ఎక్కడ బతకాలి? పండగ వరకు ఆగండి” అంటూ ఒత్తిడి. దీంతో తొలగింపు కార్యక్రమానికి బ్రేక్ పడింది.
లైసెన్స్ లేకుండా వ్యాపారం.. ఎవరి అండ?
అక్రమార్కులు చైర్ పర్సన్ ను కలిసి వినాయక చవితి పండగ వరకు గడువు ఇవ్వాలని బతిమిలాడినట్లు సమాచారం. అసలు షాకింగ్ విషయం ఏంటంటే.. రోడ్లపై తడకలు వేసి వ్యాపారం చేస్తున్న వారిలో కొంత మందికి మార్కెట్ లో లైసెన్స్ లేనే లేదు. లైసెన్స్ లేని వారికి అధికారులు ఎలా అనుమతిస్తున్నారు? దీని వెనుక నెలవారీ మామూళ్ల దందా నడుస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఎందరో డీఎంఓలు, సెక్రటరీలు మారారు కానీ మార్కెట్ లో వ్యాపారుల పెత్తనం మాత్రం మారలేదు. ఏ అధికారి నిజాయితీగా పనిచేద్దామన్నా రాజకీయ నాయకుల అండ చూసుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అభివృద్ధికి సహకరించాల్సిన నాయకులే అక్రమార్కులకు కొమ్ముకాయడం దారుణమని రైతులు, కొనుగోలుదారులు మండిపడుతున్నారు. రాజకీయ జోక్యం లేకుండా మార్కెట్ బైలా ప్రకారం పాలన సాగితేనే లక్ష్మీపురం మార్కెట్ బాగుపడుతుందని, లేకుంటే మోడల్ మార్కెట్ పేరుతో ప్రజాధనం వృధా అయినట్లేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగ తర్వాత నోటీసులు ఇచ్చి తొలగిస్తామని అధికారులు చెబుతున్నా.. ఆ నోటీసులు కూడా నాయకుల ఫోన్ కాల్స్ తో తుంగలో తొక్కుతాయా? లేక చట్టం తన పని తాను చేస్తుందా? అనేది వేచి చూడాలి.

