రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన
రైతు మేళాలు కాదు.. రైతు బాధలు చూడండి
సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది
ధాన్యం కొనుగోళ్లు లేక ఇబ్బందుల్లో రైతులు
కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు.. మమ్మల్ని ఏం చేయలేరు
విమర్శలు కాదు.. పాలనపై దృష్టి పెట్టండి
తెలంగాణ భవన్ ప్రెస్మీట్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కాకతీయ, వరంగల్ బ్యూరో : హైదరాబాద్ తెలంగాణ భవన్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల ప్రెస్మీట్లో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మేళా పేరుతో కేవలం రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. రైతు మేళాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలను బస్సుల్లో తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటివరకు 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని, రైతులకు బోనస్ ఇవ్వలేదని ఆరోపించారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో తీవ్ర పంటనష్టం జరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా అధికారులు కనీసం పరిశీలన చేయలేదన్నారు. రైతుల తరఫున కేటీఆర్ మాట్లాడితే కేసులు పెడుతున్నారని, కానీ సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రైతుల కోసం మా పోరాటం ఆగదు, దమ్ముంటే కేసులు పెట్టండి, జైలుకెళ్లేందుకైనా సిద్ధమే అని హెచ్చరించారు.
రైతు డిక్లరేషన్ అమలు చేయాలి
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బంగారు కాలం వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు మంత్రులు కల్లాల్లో తిరిగేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతులు ధాన్యం కుప్పల వద్దే పడుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ గుండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, బండి సంజయ్ వాడిన భాష అసహ్యకరమని నేతలు విమర్శించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రైతు సంగ్రామ సభకు భారీగా రైతులు హాజరయ్యారని తెలిపారు. రైతుల బాధలపై ప్రశ్నలు అడిగితే కాంగ్రెస్ నేతలు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు తెలియని వారు మాట్లాడుతున్నారు. గింజ ధాన్యం కూడా కొనలేక పోయిన ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు.
కాంగ్రెస్ రైతులను మోసం చేసింది..
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసిందన్నారు. కాంగ్రెస్ రైతు మేళా పూర్తిగా విఫలమైందని, కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. రైతు బంధు కోసం రైతులు ధర్నాలు చేయకుండానే కేసీఆర్ ఆ పథకం అమలు చేశారని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమని విమర్శించారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. రైతుల తరఫున కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ మీ కేసులకు భయపడే నాయకుడు కాదు అని స్పష్టం చేశారు.

