భద్రమ్మ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
కాకతీయ, పెద్దవంగర : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాటోత్ భద్రమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సోమవారం బీఆర్ఎస్ నాయకులు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం వీచిన ఈదురు గాలులకు ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్లు తడిసిపోతాయనే భయంతో వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో భద్రమ్మ మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించాలి
అదే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో ఇద్దరి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని సూచించారు. రైతులు రోడ్ల పైన, కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోతున్నా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, మాజీ సర్పంచ్ జ్ఞానేశ్వర చారి, రైతు కోఆర్డినేటర్ బొమ్మిడి కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆరుట్ల వెంకటరెడ్డి, శ్రీను నాయక్, బీమా నాయక్, బిక్షపతి, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

