రైతులకు అందుబాటులో బ్యాంకింగ్ సేవలు
సహకార బ్యాంకు బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
నెల్లికుదురులో డీసీసీబీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కాకతీయ, నెల్లికుదురు: రైతులకు, సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యేలా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) నూతన శాఖను ఏర్పాటు చేయడం అభినందనీయమని మహబూబాబాద్ శాసనసభ్యుడు భూక్య మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు శాఖను మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ నెల్లికుదురు మండల ప్రజలకు, ముఖ్యంగా నిరుపేద రైతులకు, సామాన్య ప్రజానికానికి బ్యాంకింగ్ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ నూతన శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తక్కువ వడ్డీకే పంట, బంగారు రుణాలు
తెలంగాణ ప్రభుత్వం సహకార రంగం బలోపేతానికి, రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వాణిజ్య బ్యాంకులతో పోటీపడుతూ డీసీసీబీ తక్కువ వడ్డీకే రైతులకు పంట రుణాలు, బంగారు రుణాలు అందిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. దీనితో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. మండల ప్రజలు, రైతులు, వ్యాపారస్థులు ఈ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధి సాధించాలని కోరారు. ముఖ్యంగా బ్యాంకు అధికారులు కూడా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్నేహపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ రామ్ చౌరి, నెల్లికుదురు డీసీసీబీ బ్యాంకు మేనేజర్ శోభన్, నెల్లికుదురు గ్రామ సర్పంచ్ పులి వెంకన్న, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు), జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

