నత్త నడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!
సగానికి పైగా స్లాబ్ దశలోనే నిలిచిన వైనం
అమాంతం పెరిగిన నిర్మాణ ఖర్చుల భారం
మొదటి విడత లక్ష్యాలకు దూరంగా ములుగు జిల్లా
ఇటుక, కంకర రేట్లను భారీగా పెంచేసిన వ్యాపారులు
రెండో విడత ప్రారంభానికి ముందే లబ్ధిదారుల్లో ఆందోళన

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు ఆశించిన స్థాయిలో సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన ఇళ్లలో చాలా భాగం ఇంకా పూర్తి కాకపోవడం, నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేటాయించిన ఇండ్లలో కేవలం 15 శాతం మాత్రమే పూర్తవటం, నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరగటం లబ్ధిదారులను కలవరపెడుతోంది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిసి ఇటుక, కంకర రేట్లను యాజమానులు అకస్మాత్తుగా పెంచడం నిర్మాణ భారాన్ని పెంచుతుంటే, ఇండ్లకు సరిపోను నిర్మాణ కార్మికుల కొరత కొంత ఇండ్ల నిర్మాణాన్ని వెనుకబడేలా చేస్తుందని జిల్లా వాసులు భావిస్తున్నారు.

సగానికి పైగా స్లాబ్ దశ వద్దే..
జిల్లాకు మొత్తం 5000 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా, వాటిలో 4396 ఇళ్లు నిర్మాణ దశకు చేరుకున్నాయి. అయితే, నిర్మాణాల పురోగతిని పరిశీలిస్తే పరిస్థితి నిరాశాజనకంగా కనిపిస్తోంది. మొత్తం ఇళ్లలో సుమారు 50 శాతం అంటే 2448 ఇళ్లు స్లాబ్ దశ వద్దే నిలిచిపోయాయి. ఇక కేవలం 15 శాతం అంటే 686 ఇళ్లు మాత్రమే పూర్తవడం గమనార్హం. జిల్లాలో అత్యధికంగా ఇళ్లు కేటాయించిన మండలం గోవిందరావుపేట. ఇక్కడ 500 ఇళ్లకు గాను కేవలం 122 ఇళ్లు (24.4 శాతం) మాత్రమే పూర్తవడం, పథకం అమలులో ఉన్న లోపాలను బయటపెడుతోంది. ప్రభుత్వం ఆశించిన వేగం అందుకోలేకపోవడం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది.
లబ్ధిదారులపై మోయలేని భారం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మందగించడానికి ప్రధాన కారణంగా నిర్మాణ ఖర్చులు పెరగడం చెప్పబడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయని తెలిసి ఇటుక ధరలను అమాంతం పెంచి అమ్ముతుండటం, కాంక్రీట్ కోసం ఉపయోగించే కంకర రేట్లను కూడా వ్యాపారులు భారీగా పెంచడంతో ఇంటి నిర్మాణం ఖర్చు పెరుగుతోంది. సిమెంట్, ఇనుము, కార్మిక వ్యయాలు పెరగడంతో లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ప్రస్తుత ధరలకు సరిపోకపోవడం వల్ల చాలా మంది మధ్యలోనే నిర్మాణాలను ఆపాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం, ప్రస్తుతం లబ్ధిదారులకే భారంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండో విడతపై సందేహాలు
ఇదిలా ఉండగా, జూన్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే మొదటి విడతలోనే పూర్తి స్థాయిలో ఇళ్లు పూర్తికాకపోవడం నేపథ్యంలో, రెండో విడత అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటే కేవలం ఇళ్ల కోసమే రేట్లు పెంచి అమ్ముతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకొని, కావలసిన నిర్మాణ సామాగ్రిని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు. మొదలు పెట్టిన ప్రతి ఇంటి నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందించే లక్ష్యంగా గృహ నిర్మాణం వేగం అందుకోకపోతే, పథకం అసలు ఉద్దేశం నెరవేరదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

