ఆనంద్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏకకాలంలో తనిఖీలు
రెండు ఇళ్లు, ఆరు ఖాళీ స్థలాల పత్రాలు స్వాధీనం
రూ.24.50 లక్షల నగదు, బ్యాంకుల్లో రూ.7.05 లక్షల నిల్వలు గుర్తింపు
సుమారు 819 గ్రాముల బంగారం, 2.2 కిలోల వెండి వస్తువులు లభ్యం
పత్రాల విలువ రూ.1.94 కోట్లు.. మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందనే అంచనాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరంగల్ రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ 2 గా పనిచేస్తూ, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న అధికారి దావులూరి ఆనంద్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయన తన సర్వీసు కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు మే 20న హన్మకొండలోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మరికొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
స్థిరాస్తుల పత్రాలు, వాహనాల గుర్తింపు
జరిపిన తనిఖీల్లో సదరు అధికారికి సంబంధించిన పలు స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.71,56,708 విలువైన రెండు నివాస గృహాలు, అలాగే రూ.28,37,000 విలువైన ఆరు ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఆయన ఇళ్లలో రూ.13,25,000 విలువైన ఒక నాలుగు చక్రాల వాహనం (కారు), రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు సోదాల్లో తేలింది. అలాగే రూ.6,07,700 విలువ చేసే గృహోపకరణ వస్తువులను అధికారులు కనుగొన్నారు. సోదాల సమయంలో ఆయన ఇళ్లలో రూ.24,50,450 అగడ్తా నగదు లభ్యమైంది. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.7,05,367 నగదు నిల్వలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు రూ.43,16,930 విలువైన సుమారు 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2264.500 గ్రాముల (సుమారు 2.2 కిలోల) వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన పత్రాల ప్రకారం ఈ ఆస్తుల మొత్తం అధికారిక విలువ రూ.1,94,01,765 గా తేలింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆస్తులకు సంబంధించి అదనపు ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, కేసు దర్యాప్తు దశలో ఉందని అవినీతి నిరోధక శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

