పాత పనులకే కొత్త శిలాఫలకాలు!
విలీన గ్రామాలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రచార ఆర్భాటమే తప్ప కాంగ్రెస్ మార్క్ ప్రగతి శూన్యం
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిప్పులు
కాకతీయ, గీసుగొండ : బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త శిలాఫలకాలు వేస్తూ ప్రజలను మోసం చేస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచెర్ల, గోపాలరెడ్డి నగర్, రెడ్డిపాలెం గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక విలీన గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, కొత్తగా ఒక్క ప్రగతి కార్యక్రమమైనా చేపట్టకుండా కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని విమర్శించారు. కనీసం రైతులకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలోనే ప్రగతి
గత బీఆర్ఎస్ పాలనలోనే విలీన గ్రామాల్లో అంతర్గత రహదారులు, కాలువలు, సొసైటీ గోదాములు, బ్యాంకు సౌకర్యాలు కల్పించామని, గోపాలరెడ్డి నగర్ ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని చల్లా స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి గ్రామ, బూత్ స్థాయి కమిటీలను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, ప్రతి ఓటును కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎనమామల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, సుంకరి శివ, దొంగల రమేష్, బాబు, కొండ రాధ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

