మునిసిపాలిటీలో ముసలం
మూడు నెలలకే మొదలైన విబేధాలు
హుజురాబాద్ మునిసిపాలిటీలో రోజుకో గడబిడ
రూ. 4.5 కోట్ల అభివృద్ధి పనుల ఆమోదంపై కౌన్సిలర్ల భిన్నాభిప్రాయాలు
30 మందిలో 19 మంది విమర్శల రాగం..
సంయుక్త ప్రకటనతో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్
చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మధ్య లోపించిన సయోధ్య
వార్డుల్లో పనులు ప్రారంభం కాకపోవడంపై నిలదీస్తున్న కౌన్సిలర్లు
అధికారిక ప్రోగ్రామ్స్ లో ప్రోటోకాల్ చిచ్చు.. వర్గాలుగా విడిపోతున్న వైనం
కాకతీయ , కరీంనగర్/హుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్త పాలకవర్గం ఏర్పడి మూడు నెలలు కూడా పూర్తికాకముందే కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతం కావడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి పనుల ఆమోదం, నిధుల కేటాయింపు, అధికార ప్రాధాన్యత అంశాల చుట్టూ మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రూ. 4.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. సమావేశంలో పలు ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే సమావేశం ముగిసిన అనంతరం 30 మంది కౌన్సిలర్లలో 19 మంది సంయుక్త ప్రకటన విడుదల చేయడం కలకలం రేపింది. తాము అన్ని పనులకు ఆమోదం తెలపలేదని, కొన్ని ప్రతిపాదనలకే మద్దతు ఇచ్చామని వారు పేర్కొనడం గమనార్హం.

వార్డుల్లో పనులు లేవు.. జనరల్ ఫండ్పై పంచాయతీ
ఎన్నికై మూడు నెలలు దాటుతున్నప్పటికీ తమ వార్డుల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ఫండ్ నుంచి ప్రతి వార్డుకు సమానంగా నిధులు కేటాయించి పనులు చేపట్టాలని వారు గట్టిగా కోరుతున్నారు. ప్రజలు తమను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని కొందరు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో హుజూరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా సమన్వయంతో ముందుకు సాగుతారని భావించినప్పటికీ, మూడు నెలలు పూర్తికాకముందే పాలకవర్గంలో విభేదాలు బయటపడటం చర్చకు దారితీసింది.
ప్రోటోకాల్ చిచ్చు.. అధికార పోరు
ఇటీవల జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్కు తగిన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి కూడా ఈ విభేదాలకు ప్రధాన కారణమైందన్న చర్చ సాగుతోంది. వేదికపై ఆహ్వానం, కార్యక్రమాల్లో గుర్తింపు వంటి ప్రోటోకాల్ అంశాలపై అసమ్మతి వ్యక్తమైంది. ఇదే క్రమంలో కౌన్సిలర్ల మధ్య ఇప్పటికే ఉన్న అంతర్గత గ్రూపుల తగాదాలు మరింత బహిర్గతమయ్యాయి. అధికార పార్టీకే చెందిన 19 మంది కౌన్సిలర్లు ఒకేతాటిపైకి వచ్చి బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా, మూడు నెలలకే హుజూరాబాద్ మున్సిపాలిటీలో తెరపైకి వచ్చిన ఈ విభేదాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

