బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదింపడం ఖాయం
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
జాన్పాక, ధర్మారం గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ కమిటీ సమావేశాలు
కాకతీయ, గీసుగొండ : రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని,ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పబోతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని జాన్పాక,ధర్మారం గ్రామాల్లో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదని,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, మహిళలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాయని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకే కొత్త శిలాఫలకాలు వేయడం తప్ప కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదని విమర్శించారు.
గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని,బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపు నిచ్చారు.కేంద్రం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని,కష్టకాలంలో కార్యకర్తలను వదిలిపెట్టేది బిఆర్ఎస్ పార్టీ కాదని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఇనమాముల మాజీ డైరెక్టర్ గోలి రాజయ్య, యువ నాయకులు సుంకరి శివకుమార్, గాడిదల రాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి
మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పులుగు వీరారెడ్డి మృతిచెందగా,ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన చల్లా ధర్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఇటీవల మృతిచెందిన సోనబోయిన సమ్మయ్య కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బోడకుంట్ల ప్రకాష్, గుర్రం రఘు,యూత్ అధ్యక్షుడు సిరిషే శ్రీకాంత్,ముఖ్య కార్యకర్తలు, యువజన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

