ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర
అపారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ
బీజేపీకి తొత్తుగా కేంద్ర ఎన్నికల కమిషన్
బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ
21 నుంచి మీనాక్షి నటరాజన్తో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తా
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని, ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందన్నారు. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ ఓట్ల గల్లంతుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
2002లో పారదర్శకంగా జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇప్పుడు అపారదర్శకంగా సాగుతోందని మహేష్ గౌడ్ విమర్శించారు. “ఎస్ఐఆర్ ప్రక్రియలో నా ఓటు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డిల ఓట్లు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. దీన్ని అడ్డుకోవాలంటే బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన పిలుపునిచ్చారు. 21 నుంచి మీనాక్షి నటరాజన్తో కలిసి తాను నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, 21న మక్తల్, 23న ఆందోల్ నియోజకవర్గాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
మోడీ, అమిత్ షాలకు హెచ్చరిక
రాజకీయాల్లో చక్రవర్తుల్లా ఉండాలని భావించే మోదీ, అమిత్ షాల అహంకారం త్వరలోనే నేలమట్టం అవుతుందని మహేష్ గౌడ్ జోస్యం చెప్పారు. “దేవుడి పేరు చెప్పుకోకుండా బీజేపీకి ఓట్లు పడవు. జై శ్రీరామ్ అనడం అందరికీ తెలుసు. జగ్గారెడ్డి నిత్యం పూజలు చేస్తారు, కానీ మేం దేవుడి పేరుతో ఓట్లు అడగం” అని స్పష్టం చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ, ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. ఆయన వెనుక బీజేపీ ఉందని, ఆ పార్టీ ఆడించినట్లు పవన్ ఆడుతున్నారని విమర్శించారు. “మీ సానుభూతి మాకు అక్కర్లేదు, మీ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు” అని ఘాటుగా సమాధానమిచ్చారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇచ్చారు. “గత 12 ఏళ్లలో మీరు రాష్ట్రానికి ఏం చేశారో చిట్టా ఇవ్వండి? సబర్మతికి నిధులు ఇస్తారు, మూసీ ప్రక్షాళన కోసం ఇవ్వరా? విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు?” అని నిలదీశారు.
కాంగ్రెస్ పాలన – అభివృద్ధి
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 80 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రైవేట్ ఆస్పత్రులు బాగుపడితే, తమ ప్రభుత్వంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మహేష్ గౌడ్ ఆరోపించారు.

