కుడా ప్లాట్ల వేలంలో భారీ అవినీతి
వేలాన్ని రద్దు చేసి సీబీఐ విచారణ జరపాలి
ఆఫ్లైన్ వేలం వెనుక రూ. 50 కోట్ల క్విడ్ ప్రోకో
సిండికేట్గా మారి ప్రభుత్వ ఖజానాకు గండి
కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి
ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలా? : మాజీ ఎమ్మెల్యే, దాస్యం వినయ్భాస్కర్
కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ప్లాట్ల వేలంలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దల నీడలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, తక్షణమే ఆ వేలాన్ని రద్దు చేసి సీబీఐతో పాటు ప్రభుత్వ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్కీ లక నేతలు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కుడా భూముల వేలం ప్రక్రియలో లోపాలు, అక్రమాలు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి అంశంలో ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల అమలును పూర్తిగా విస్మరించిందన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కీలకంగా ఉండాల్సిన కుడా సంస్థను ప్రస్తుతం అవినీతికి అడ్డాగా మార్చారని, అధికారులు సైతం అక్రమాలకు సహకరించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రపంచమంతా పారదర్శకత కోసం ఆన్లైన్ ఈ-వేలం విధానాన్ని అనుసరిస్తుంటే, కుడా ప్లాట్ల వేలాన్ని ఉద్దేశపూర్వకంగా ఆఫ్లైన్లో నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు, ఇళ్ల కూల్చివేతలు, బెదిరింపులు మానేసి మిగిలిన కాలంలోనైనా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అలాగే, యాదవ్ నగర్, రెడ్డిపురం మార్గంలోని చెరువును నిబంధనలకు విరుద్ధంగా పూడ్చివేస్తూ వాల్టా చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.
సిండికేట్గా మారి ప్రభుత్వ ఖజానాకు గండి
కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 21న కుడా నిర్వహించిన ప్లాట్ల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. బహిరంగ మార్కెట్లో గజం ధర రూ. 1.30 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు పలుకుతుంటే, వేలంలో మాత్రం కేవలం రూ. 66 వేల నుండి రూ. 69 వేలకే విక్రయించడం వెనుక కోట్ల రూపాయల చేతులు మారాయని ఆరోపించారు. కేవలం 11 నుండి 13 మంది మాత్రమే వేలంలో పాల్గొనేలా చూసి, మిగిలిన వారిని అడ్డుకున్నారన్నారు. కొందరు అధికార పార్టీ నేతలు సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరలకే ప్లాట్లు దక్కించుకోవడం వల్ల కుడా ఖజానాకు సుమారు రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని లెక్కలతో వివరించారు. గతంలో బహిరంగ ప్రాంగణంలో నిర్వహించే వేలాన్ని, ఈసారి కార్యాలయం లోపల రహస్యంగా నిర్వహించడంపై చైర్మన్, వైస్ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ‘క్విడ్ ప్రోకో’ వ్యవహారంపై విచారణ జరిపి నిందితులను శిక్షించకపోతే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, మాజీ మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్ సింగ్, మాజీ కార్పొరేటర్లు సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, కుసుమ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

