అప్పుల బాధతో వార్డు సభ్యుడి ఆత్మహత్య
ఎనగంటి గ్రామంలో విషాదం
కాకతీయ, చందుర్తి: చందుర్తి మండలంలోని ఎనగంటి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో మనస్తాపానికి గురైన 4వ వార్డు సభ్యుడు మెరుపుల రవి గౌడ్ (40) శుక్రవారం తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రవి గతంలో సౌదీ అరేబియాలో కార్మికుడిగా పనిచేసి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఎంతో శ్రమించారు. తిరిగి స్వగ్రామానికి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ఉపాధి లభించకపోవడం, మరోవైపు అప్పుల భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రజాప్రతినిధిగా గ్రామ అభివృద్ధికి కృషి చేసిన రవి అకాల మరణంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

