ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
అర్హులైన వారిని ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి
అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పనే లక్ష్యం
బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకం
డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన సదస్సు
కాకతీయ, హనుమకొండ : ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బి ఎల్ ఏ లు) పూర్తి అవగాహనతో, అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి గార్డెన్లో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు అధ్యక్షతన బూత్ లెవల్ ఏజెంట్ల ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఇనగాల వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో బూత్ లెవల్ ఏజెంట్లు ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అర్హులందరికీ ఓటు హక్కు.. నకిలీ ఓట్లపై నిఘా
క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు నమోదు అయ్యేలా బూత్ లెవల్ ఏజెంట్లు చొరవ చూపాలని, అదే సమయంలో నకిలీ మరియు అనర్హమైన ఓట్ల తొలగింపుపై నిరంతరం నిఘా ఉంచాలని వెంకట్రామ్రెడ్డి సూచించారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారానే రాబోయే ఎన్నికల్లో విజయానికి బలమైన పునాది వేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ లెవల్ ఏజెంట్లు మరింత సమర్థవంతంగా, చురుగ్గా పనిచేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకతను కాపాడేందుకు గాను ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక, చట్టపరమైన అంశాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ ప్రత్యేక అవగాహన సదస్సులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీనుబాబు, హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

