తప్పుడు పత్రాలతో ఆస్తి రిజిస్ట్రేషన్
మున్సిపల్ రికార్డుల్లో లేని నకిలీ ధృవీకరణ పత్రాలు
కుటుంబ ఆస్తిని నకిలీ పత్రాలతో కాజేసేందుకు యత్నం
అక్రమంగా బ్యాంకు రుణం కూడా పొందారు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గుండెబోయిన రవి డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తిని, తన ప్రమేయం లేకుండానే నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా, ఆ ఆస్తిపై బ్యాంక్ రుణం కూడా పొందారని బాధితుడు గుండెబోయిన రవి ఆరోపించారు. ములుగులోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రవి తెలిపిన వివరాల ప్రకారం.. 1997లో ఒక ఇంటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుని, అందులో రూ. లక్ష చెల్లించారు. అప్పట్నుంచే ఆ ఇంటిని తమ కుటుంబం స్వాధీనంలో ఉంచుకుని, పన్నులు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. అయితే 2012 నుంచి ఈ ఆస్తిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో 2019లో రవికి తెలియకుండానే తన తమ్ముడు గుండెబోయిన శ్రీనివాస్, తన భార్య శ్రీకల పేరుతో నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
మున్సిపల్ రికార్డుల్లో ఆధారాల్లేవ్
ఆర్.టి.ఐ ద్వారా సేకరించిన సమాచారంలో, సదరు ధృవీకరణ పత్రాలకు ఎటువంటి అధికారిక ఆధారాలు లేవని, అవి నకిలీవని మున్సిపల్ కమిషనర్ కూడా లిఖితపూర్వకంగా స్పష్టం చేశారని రవి వెల్లడించారు. ఈ నకిలీ పత్రాలను అడ్డం పెట్టుకుని ఫెడరల్ బ్యాంకులో సుమారు రూ. 15 లక్షల గృహ రుణం పొందారని ఆయన ఆరోపించారు. బ్యాంకు రికార్డుల్లో 2007 నుంచే శ్రీకల పేరుతో యాజమాన్యం ఉన్నట్లు చూపడంపై రవి అభ్యంతరం వ్యక్తం చేశారు. 2007లో శ్రీకలకు వివాహం కాలేదని, ఆమె మైనర్ అని, తొమ్మిదో తరగతి చదువుతున్నారని ఆయన తెలిపారు. అటువంటి స్థితిలో ఆమె పేరుతో ఆస్తి పత్రాలు ఎలా నమోదయ్యాయని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ అక్రమాల్లో సాక్షులుగా వ్యవహరించిన పైడిమల్ల జ్యోతి, భరత్లతో పాటు, సహకరించిన అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. తనకు రావాల్సిన ఆస్తి వాటాను ఇప్పించాలని, నకిలీ పత్రాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

