- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- బూత్ స్థాయి అధికారులతో సమీక్ష
కాకతీయ, హనుమకొండ : ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 8వ డివిజన్ పరిధిలో గల 9 పోలింగ్ కేంద్రాలను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), బూత్ స్థాయి ఏజెంట్లతో (బీఎల్ఏలు) ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల సవరణ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను ఎక్కడా చిన్న పొరపాట్లు లేకుండా నింపాలని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. “ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. గడపగడపకూ వెళ్లి అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి వారిని జాబితాలో చేర్పించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ అధ్యక్షుడు టి. మనోహర్, సీనియర్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

