బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
కాకతీయ, గీసుగొండ: చోరీకి పాల్పడిన ఓ నిందితుడిని గీసుగొండ పోలీసులు శుక్రవారం చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం జాన్పాక గ్రామ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా ఒక ట్రాన్స్ఫార్మర్ వెనుక దాక్కునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, వరంగల్ ఆదర్శ్ కాలనీలో జరిగిన చోరీ కేసు బయటపడింది.
నిందితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా పుట్టిపల్లి గ్రామానికి చెందిన నందిపాటి జార్జ్ అలియాస్ రమణయ్య (64)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వరంగల్లోని ఆదర్శ్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిని అర్ధరాత్రి వేళ పగులగొట్టి, నగలు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి సుమారు ఒక గ్రాము బంగారు ఉంగరం, 50 గ్రాముల వెండి కాళ్లపట్టీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అనిల్ కుమార్, కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

