- సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ శ్వేత
- అవినీతి ఆరోపణలు, సివిల్ కేసులో ఎస్సై మహేందర్ జోక్యం
- బాధితులకు వ్యతిరేకంగా ప్రవర్తన
- డిపార్ట్మెంట్ విచారణలో నిజ నిర్ధారణ
- ఎస్సైని విధుల నుంచి తొలగిస్తూ సీపీ శ్వేత ఆదేశాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలో మరో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసుపై వేటుపడింది. నెక్కొండ ఎస్సై మహేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మహేందర్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదీ కాకుండా ఓ సివిల్ కేసులో బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. రూ. 50 వేలు బాకీ పడినందుకు తన భార్యపై దాడి చేసి తన గొర్లు, మేకలను అనిల్, వాగ్య.. మరికొందరు కలిసి దౌర్జన్యంగా పట్టు కెళ్లారని నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గాడుదల వెంకన్న ఎస్సై మహేందర్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్సై బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినట్లు బాధితుడు ఆరోపిస్తూ నర్సంపేట ఏసీపీకి ఫిర్యాదు చేసాడు. ఇది ఇలా ఉండగా, ఎస్సై మహేందర్ పలు కేసుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో ఎస్సై తీరుపై శాఖా పరమైన విచారణకు పోలీస్ ఉన్నత అధికారులు ఆదేశించారు. విచారణలో ఎస్సై మహేందర్ పై వెళ్ళు వెత్తిన ఆరోపణలు, గొర్రెల కేసులో బాధ్యత రాహిత్యం నిజమని తేలినట్లు తెలిసింది. ఎస్సై తీరుపై ఏ మాత్రం ఉపేక్షించకుండా శాఖా పరమైన చర్యలు చేపట్టారు. ఎస్సై మహేందర్ను విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేశారు. వరంగల్ సీపీ శ్వేత ఏ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడినా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు.

