రిషి బార్లో కుళ్లిన బిర్యానీ కలకలం..!
దుర్వాసన రావడంతో వినియోగదారుల ఆందోళన
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలపై ప్రశ్నలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ ఏనుమాముల మార్కెట్ ప్రాంతంలోని రిషి రెస్టో బార్ అండ్ రెస్టారెంట్లో కుళ్లిన బిర్యానీ వడ్డించారంటూ వినియోగదారులు గురువారం ఆందోళనకు దిగారు. బిర్యానీ నుంచి దుర్వాసన రావడంతో రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, కొందరు వినియోగదారులు మద్యం, బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీ తింటుండగా దుర్వాసన రావడంతో వారు వెంటనే రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో నగరంలోని హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో అందిస్తున్న ఆహార నాణ్యతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మురికికాల్వల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించడం, ఈగలు ముసురుతున్న మాంసాహారం విక్రయించడం, పలుమార్లు వాడిన వంటనూనెతో ఆహారం తయారు చేయడం వంటి అంశాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సమర్థవంతమైన తనిఖీలు నిర్వహించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కలుషిత ఆహారం విక్రయించడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


