మా మండలానికి పోలీస్ స్టేషన్ కావాలి
ఏర్పాటు చేయకుంటే సీఎం పర్యటన అడ్డుకుంటాం
నడికూడ మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
నాలుగు గ్రామ పంచాయతీలు ఇతర స్టేషన్ల పరిధిలోనే
అత్యవసర సమయాల్లో ప్రజలకు తప్పని ఇబ్బందులు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పగడాల కాళీ ప్రసాద్రావు
కాకతీయ, పరకాల : నడికూడ మండల కేంద్రంలో పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరకాల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్రావు హెచ్చరించారు. మండల ప్రజల భద్రత, మహిళల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం వెంటనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నడికూడ మండల కేంద్రంలో పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు ఎరుకల దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో కాళీ ప్రసాద్రావు, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి పాల్గొన్నారు. రెండువేల పద్దెనిమిదిలో నడికూడ మండలం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మండలంపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
నాలుగు గ్రామాలు ఇతర స్టేషన్ల పరిధిలోనే
కంటాత్మకూర్, కౌకొండ, రామకృష్ణాపూర్, సర్వాపూర్ గ్రామ పంచాయతీలు ఇప్పటికీ ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్నాయని కాళీ ప్రసాద్రావు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు చిన్న ఫిర్యాదుల కోసం సైతం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసు సేవలు సకాలంలో అందక మహిళలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా పోరాటం కొనసాగిస్తామని కాళీ ప్రసాద్రావు హెచ్చరించారు. ధర్నా కొనసాగుతున్న సమయంలో పరకాల సీఐ ఫోన్లో ఆయనతో మాట్లాడి, నడికూడలో పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తీగల భరత్గౌడ్, తిప్పారపు సుధీర్, దండు సురేష్, అరణ్యరెడ్డి, గోనెల కోటేశ్వర్, బాణాల శ్రీనివాస్, దొగ్గల వంశీ, మేకల నరేష్, గోగుల రాజిరెడ్డి, శ్రీరాం రెడ్డి, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

