బల్దియా పారిశుధ్యంపై ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ బృందం అధ్యయనం
వ్యర్థాల సేకరణ నుంచి ప్రాసెసింగ్ వరకు క్షేత్రస్థాయి పరిశీలన
కమిషనర్ టి. వెంకన్నతో సమావేశం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో అమలవుతున్న పారిశుధ్య నిర్వహణ విధానాలపై అధ్యయనం చేసేందుకు ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా సంస్థ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్), చెన్నైకి చెందిన బృందం రెండు రోజుల పర్యటనకు వచ్చింది. మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి. వెంకన్నతో సమావేశమై ఇంటింటి వ్యర్థాల సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, స్వచ్ఛ ఆటోల నిర్వహణ, పారిశుధ్య సిబ్బంది విధులు, వ్యర్థాల ప్రాసెసింగ్పై చర్చించింది. శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లతో డివిజన్ల వారీగా పారిశుధ్య పనుల నిర్వహణ, సమస్యలు, ప్రజల భాగస్వామ్యంపై వివరాలు సేకరించారు. శానిటరీ జవాన్లతో క్షేత్రస్థాయి విధులు, సవాళ్లు, ప్రజల సహకారంపై చర్చించారు. బాలసముద్రంలో స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో ఇంటింటి చెత్త సేకరణ, రూట్ల నిర్వహణపై, కంపోస్టింగ్, బయోమెథనేషన్ యూనిట్ సిబ్బందితో సేంద్రియ వ్యర్థాల ప్రాసెసింగ్పై వివరాలు తెలుసుకున్నారు.
డీఆర్సీసీ సందర్శన
మొదటి రోజు పర్యటనలో భాగంగా నక్కలగుట్ట డీఆర్సీసీని సందర్శించిన బృందం అక్కడి కార్యకలాపాలను పరిశీలించింది. బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి అధ్యయనం కొనసాగించనుంది. కార్యక్రమంలో సీఎంహెచ్వో డా. రాజారెడ్డి, ఎస్ఈ రాజ్కుమార్, ఎంహెచ్ఓ డా. రాజేష్, ఈఈ మహేందర్, సూపరింటెండెంట్ బాకం సంతోష్, డీఈ స్పందన తదితరులు పాల్గొన్నారు.

