ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు.. లేదంటే చర్యలే
భవన నిబంధనలు పాటిస్తేనే ఓసీలు
ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవు
హంటర్ రోడ్ నుంచి నక్కలగుట్ట వరకు క్షేత్రస్థాయి తనిఖీలు
కమిషనర్ వెంకన్న ఆకస్మిక పరిశీలనలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : శాంక్షన్డ్ ప్లాన్ ప్రకారమే భవనాలు నిర్మిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం హంటర్ రోడ్, ప్రకాశ్రెడ్డిపేట, నక్కలగుట్ట, జూలైవాడ, ఎక్సైజ్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఓసీల కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓసీ కోసం వచ్చిన భవనాల కొలతలను స్వయంగా పరిశీలించిన కమిషనర్.. మంజూరైన ప్లాన్కు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టారా లేదా అన్నది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే ఓసీ జారీ చేయబోమని స్పష్టం చేశారు.
ముందస్తు అనుమతి తప్పనిసరి
నగరంలో కొత్త భవనాలు నిర్మించే ముందు తప్పనిసరిగా బల్దియా నుంచి అనుమతి తీసుకోవాలని కమిషనర్ సూచించారు. మంజూరైన ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే అనుమతులు, ఓసీలు ఇవ్వబోమని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాతే ఓసీ కోసం దరఖాస్తు చేసుకోవాలని భవన యజమానులకు సూచించారు. భవన నిర్మాణ నిబంధనలు, ఓసీల జారీలో ఎలాంటి ఉల్లంఘనలకు తావులేకుండా క్షేత్రస్థాయి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని కమిషనర్ వెంకన్న తెలిపారు. తనిఖీల్లో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీ ప్రశాంత్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

