కొండాయిగూడెం ర్యాంప్లో ఓవర్లోడింగ్!
49.5 టన్నుల పరిమితి.. 57 టన్నుల వరకు ఇసుక రవాణా?
గురువారం రోజంతా ఓవర్లోడ్ లారీలే..
విషయం బయటకు రాగానే ఎస్ఆర్ఏ బదిలీ?
లారీకి రూ.2,300 వసూలు.. ఓవర్లోడ్కు అదనపు వసూళ్లు?
శ్రీకర్ కనుసన్నల్లోనే వ్యవహారమా?.. అధికారుల చర్యలపై ప్రశ్నలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కొండాయిగూడెం ఇసుక ర్యాంప్లో నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడింగ్ జరుగుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నిబంధనల ప్రకారం లారీ బరువుతో కలిపి గరిష్ఠంగా 49,500 కిలోలు మాత్రమే ఉండాల్సి ఉండగా.. ర్యాంప్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కొన్ని లారీల్లో సుమారు 57 వేల కిలోల వరకు ఇసుక లోడ్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఒక్కో లారీలో దాదాపు 7.5 టన్నుల అదనపు లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గురువారం రోజంతా ఈ తరహా ఓవర్లోడింగ్ జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సంబంధిత ఎస్ఆర్ఏను బదిలీ చేసినట్లు తెలిసినా.. ఓవర్లోడింగ్కు అసలు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

57 టన్నుల లోడింగ్ ఎలా?
కొండాయిగూడెం ర్యాంప్ నుంచి ఓవర్లోడ్తో హైదరాబాద్కు వెళ్తున్న లారీల దృశ్యాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా 49.5 టన్నుల పరిమితి ఉండగా.. 57 టన్నుల వరకు లోడ్ చేయడం వెనుక ఎవరి అనుమతి ఉందన్నది కీలకంగా మారింది. గురువారం రోజంతా ఓవర్లోడింగ్ జరిగినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో.. ఆ రోజు ర్యాంప్ నుంచి బయటకు వెళ్లిన వాహనాలన్నింటి తూకం వివరాలను పరిశీలిస్తే అసలు విషయం తేలే అవకాశం ఉంది. వెయ్బ్రిడ్జి రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, రవాణా వివరాలు, సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఓవర్లోడ్ లారీలను తూకం వేసినట్లయితే ఎంత బరువు నమోదైంది? అదనపు లోడ్ గుర్తించిన తర్వాత ఏ చర్యలు తీసుకున్నారు? అనే వివరాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.
విషయం బయటకు రాగానే బదిలీ?
ఓవర్లోడింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ర్యాంప్లో పనిచేస్తున్న ఎస్ఆర్ఏను బదిలీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఓవర్లోడింగ్ ఒక్క అధికారి పర్యవేక్షణతోనే సాధ్యమవుతుందా? ర్యాంప్లో లోడింగ్, తూకం, వాహనాల బయటకు పంపడం వంటి ప్రక్రియల్లో మరెవరి పాత్ర ఉంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బదిలీతోనే వ్యవహారాన్ని ముగించకుండా.. ఓవర్లోడ్ చేయించిన వారు, అనుమతించిన వారు, పర్యవేక్షించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారన్నది స్పష్టం చేయాల్సి ఉంది. ర్యాంప్లో ప్రతి లారీ నుంచి లోడింగ్, కాంటా సీరియల్ పేరుతో రూ.2,300 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి అదనంగా ఓవర్లోడ్ కోసం ఒక్కో బకెట్కు మరో రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మొత్తాలను ఎవరు వసూలు చేస్తున్నారు? అధికారిక రసీదులు ఇస్తున్నారా? ర్యాంప్ రికార్డుల్లో ఈ లావాదేవీలు నమోదవుతున్నాయా? అనే అంశాలపై విచారణ అవసరమని తెలుస్తోంది. తూకం రికార్డులు, ర్యాంప్ రిజిస్టర్లు, వాహనాల వివరాలు, చెల్లింపుల ఆధారాలను పరిశీలిస్తే వసూళ్ల వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
శ్రీకర్ కనుసన్నల్లోనే ఓవర్లోడింగ్?
కొండాయిగూడెం ర్యాంప్ కాంట్రాక్టర్ శ్రీకర్ కనుసన్నల్లోనే ఓవర్లోడింగ్, అదనపు వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ జరగలేదు. కాంట్రాక్టర్కు ఇందులో ప్రత్యక్ష పాత్ర ఉందా? ర్యాంప్ సిబ్బంది ఎవరి ఆదేశాలతో ఓవర్లోడ్ చేస్తున్నారు? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అదే సమయంలో రాత్రివేళల్లో లోడింగ్, తూకం, అన్లోడింగ్ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఆయా సమయాల్లోని సీసీటీవీ ఫుటేజీ, వెయ్బ్రిడ్జి రికార్డులను సరిపోల్చితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. ఓవర్లోడింగ్ నిజమైతే ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడంతో పాటు రహదారి భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. నిబంధనలు పాటిస్తూ ఇసుక రవాణా చేస్తున్న లారీ యజమానులకు కూడా అన్యాయం జరుగుతుంది. అందువల్ల కొండాయిగూడెం ర్యాంప్లో గురువారం జరిగిన లోడింగ్ మొత్తం రికార్డులను పరిశీలించి.. ఓవర్లోడింగ్కు బాధ్యులెవరో తేల్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బదిలీతో సరిపెట్టకుండా అసలు వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు, విధుల్లో ఉన్న సిబ్బంది పాత్రపై సమగ్ర విచారణ జరపాల్సి ఉంది.

