యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధ్వజం
కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట
పరకాలలో భారీ ర్యాలీ.. అంబేద్కర్ సెంటర్లో ఉద్రిక్తత
పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం
కాకతీయ, పరకాల : ఎన్నికల ముందు యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి యువత తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు పరకాల పట్టణంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ కూడలి వరకు సాగి తిరిగి అంబేద్కర్ సెంటర్కు చేరుకుంది. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీకి సంఘీభావం తెలిపారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
విద్యార్థులను అడ్డుకోవడంపై ఆగ్రహం
ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంపై చల్లా ధర్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను చూస్తే రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అడ్డుకోవడం చేతగాని పాలనకు నిదర్శనమని విమర్శించారు. ధర్నాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి తోపులాటకు దారితీయడంతో అంబేద్కర్ సెంటర్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, యూత్ కమిషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చిందని, వాటి అమలు ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థులకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, విదేశీ విద్యకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం వంటి హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో విద్యారంగానికి పెద్దపీట వేశామని, గురుకులాలు, జూనియర్ కళాశాలల సంఖ్యను పెంచడంతో పాటు ‘మన ఊరు–మన బడి’, ‘మన బస్తీ–మన బడి’ కార్యక్రమాల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేశామని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లతో పాటు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల బలోపేతం చేపట్టామని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాల ద్వారా విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం అందించామని గుర్తు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, విద్యార్థులకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వీ, యువజన నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

