హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసింది
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి
జాబ్ క్యాలెండర్తోపాటు పెండింగ్ బకాయిలు చెల్లించాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కాకతీయ, నర్సంపేట టౌన్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పాలనపై చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం నర్సంపేట చౌరస్తాలో విద్యార్థులు, యువతతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు పార్టీ పరిశీలకుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. జాబ్ క్యాలెండర్, స్కూటీలు, యూత్ డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా భరోసా కార్డు వంటి హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును పట్టించుకోకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
జీఓ 97ను రద్దు చేయాలి
యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పరిశీలకుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయడంతోపాటు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

