హామీలను గాలికొదిలిన కాంగ్రెస్
1000 రోజుల పాలన ప్రజలకు నిరాశే
420 హామీల అమలులో ప్రభుత్వం విఫలం
రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత సమస్యలను పట్టించుకోవడం లేదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
కాకతీయ, చెన్నారావుపేట : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్నతో కలిసి ముత్తిరెడ్డి నిరసనలో పాల్గొని అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటి అమలును విస్మరించిందని ముత్తిరెడ్డి ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, ఉచిత స్కూటీలు, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, పంటల కొనుగోలు, సాగునీరు, నాణ్యమైన విద్యుత్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రశ్నించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, కేసీఆర్ కిట్ హామీల పరిస్థితి ఏంటని నిలదీశారు.
నర్సంపేటపై నిర్లక్ష్యం
నర్సంపేట నియోజకవర్గంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ముత్తిరెడ్డి విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సమస్యల పరిష్కారం కోసమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తుచేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావచ్చుగానీ ప్రజల ప్రశ్నల నుంచి తప్పించుకోలేరని ముత్తిరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజల తరఫున బీఆర్ఎస్ మరింత ఉధృతంగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్లు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, యువజన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

