ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?
తీరని బస్ స్టాండ్ కష్టాలు..
చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ అధికారులు
రూ.5 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన మూత్రశాలల నిర్మాణం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు,వృద్ధులు
తక్షణమే నిర్మాణం పూర్తి చేయాలని ప్రజల డిమాండ్
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సుమారు బస్టాండ్ ప్రారంభమై 6 సంవత్సరాల 9 నెలలు పూర్తవుతున్నప్పటికీ,నేటికీ ప్రయాణికుల కోసం మూత్రశాలలు నిర్మించకపోవడం శోచనీయం.నిత్యం వందలాదిమంది ప్రయాణికులు,విద్యార్థులు,ఉద్యోగులు, వరంగల్,ఖమ్మం,తొర్రూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.మూత్రశాలలు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు,చిన్నపిల్లలు,వృద్ధులు,గర్భిణీల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.కొంతమంది ప్రయాణికులు బస్టాండ్ కాంప్లెక్స్ వెనుక భాగంలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు.దింతో బస్టాండ్ పరిసర ప్రాంతంలోని సమీప నివాసితులు,వ్యాపారులు దుర్గంధంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బస్టాండ్ ప్రాంగణంలో ఏళ్లు గడుస్తున్నా..మూత్రశాలలు ఏవి స్వామి? అంటూ ప్రయాణికులు,స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు.

రూ.5 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా?
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల(ఎస్డిఎఫ్) నుంచి సుమారు రూ.5 లక్షలు వెచ్చించి మూత్రశాలల నిర్మాణం చేపట్టారు.అయితే..ఆ నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయి కేవలం పిల్లర్లు,స్లాబ్ స్థాయికే పరిమితమైంది.స్లాబ్ పోసి అర్ధాంతరంగా పనిని మధ్యలోనే వదిలేయడంతో లక్షల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరేనా? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అరకొరగా మిగిలిపోయిన మూత్రశాలల నిర్మాణం ఇప్పుడు చెత్త చెదారంతో పాడుబడిన భవనంలా దర్శనమిస్తోందని మండిపడుతున్నారు.
అధికారుల ఉదాసీనత :
‘స్వచ్ఛత’ గురించి ఉపన్యాసాలు దంచికొట్టే ప్రజాప్రతినిధులు,అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు,పంచాయతీ పాలకులు తక్షణమే స్పందించి రాయపర్తి బస్టాండ్ ఆవరణలో అసంపూర్తిగా ఉన్న మూత్రశాలల నిర్మాణం తక్షణమే పూర్తి చేసి ప్రయాణికుల కష్టాలను తీర్చాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిధులు విడుదల కాకపోవడం వల్లే పనులు ఆగాయి
పంచాయతీ కార్యదర్శి యాకుబ్ నాయక్
గతంలో మూత్రశాలల నిర్మాణానికి మంజూరైన ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డిఎఫ్) ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్లే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని అన్నారు.అప్పటివరకు చేపట్టిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి బకాయి బిల్లులు చెల్లిస్తే తప్ప,తదుపరి పనులు ప్రారంభించబోమని కాంట్రాక్టర్ స్పష్టం చేశారని తెలిపారు.నిధుల విడుదల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని కార్యదర్శి యాకుబ్ నాయక్ వివరణ ఇచ్చారు.

