యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం
మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి
వరంగల్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతికత వినియోగం
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న
కాకతీయ,వరంగల్ : భవిష్యత్ వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అన్నారు. ముఖ్యంగా త్వరలో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు ఆధునిక సీవరేజ్ సాంకేతికతలు దోహదపడతాయని తెలిపారు. ముంబైలో జరుగుతున్న ఐఎఫ్ఏటీ ఇండియా 2026 ప్రదర్శనలో చివరి రోజైన శుక్రవారం ఆయన పాల్గొని వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను పరిశీలించారు.
మంచినీటి సరఫరా, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సీవరేజ్ నిర్వహణలో అందుబాటులోకి వచ్చిన నూతన విధానాలను కమిషనర్ పరిశీలించారు. నీటి వృథాను అరికట్టడం, వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడం వంటి అంశాలపై సంస్థల ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూజీడీలో సెప్టిక్ ట్యాంకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, పైప్లైన్ల అనుసంధాన విధానాలను పరిశీలించారు.
సాంకేతికతతో మెరుగైన నగర పాలన
ఆస్ట్రల్, సింటెక్స్ సంస్థలు ప్రతిపాదించిన ఆధునిక పైప్ సాంకేతికతలను అధ్యయనం చేసినట్లు వెంకన్న తెలిపారు. నగర అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రయోజనకరమైన సాంకేతికతలను వినియోగించుకుంటామని చెప్పారు. ఆధునిక బిల్లింగ్ యంత్రాలపై కూడా అవగాహన పొందినట్లు తెలిపారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు సేవలను వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా అందించవచ్చన్నారు. ఐఎఫ్ఏటీ ప్రదర్శన ఆధునిక సాంకేతికతలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంచి అనుభవంగా నిలిచిందని పేర్కొన్నారు.

