మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్
కాకతీయ, హనుమకొండ : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా హనుమకొండ జిల్లా గోపాల్పూర్కు చెందిన తెలంగాణ టీచర్స్ యూనియన్ మాజీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వల్లాల సదానందం గౌడ్ను నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. శనివారం గోపాల్పూర్లో జిల్లా అధ్యక్షుడు తోటకూరి రాందాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గీత కార్మికుల హక్కుల రక్షణ కోసం సదానందం గౌడ్ గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. నియామకమైన నాటి నుంచి 2 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారని చెప్పారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 50 సంవత్సరాలు నిండిన అర్హులైన గీత కార్మికులందరికీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ధి రాములు గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు తోటకూరి రాందాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి బొమ్మగాని శ్యామ్కుమార్ గౌడ్లకు సదానందం గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

