14 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్
డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగిస్తే చర్యలు
చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్ హెచ్చరిక
కాకతీయ , చిగురుమామిడి : వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై ముందస్తు చర్యలు చేపట్టినట్లు చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. మండలంలోని 14 మంది డీజే ఆపరేటర్లను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని ఆపరేటర్లకు స్పష్టంగా సూచించినట్లు ఎస్సై తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని, పోలీసుల ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై జగదీశ్వర్ వివరించారు

