- డిసెంబర్ 26 నుంచి అమల్లోకి..
- ఈ ఏడాదిలో ధరలను పెంచడం రెండోసారి
- తాజాగా పెంపుతో రైల్వేశాఖకు రూ.600 కోట్ల అదనపు ఆదాయం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: టికెట్ ధరలను పెంచు భారతీయ రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. పెంచిన కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే తాజాగా పెంపుతో రైల్వేశాఖకు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. అయితే పెరిగిన ఖర్చులు అనుగుణంగా, ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
రైల్వే శాఖ చేసిన కొత్త మార్పులు ప్రకారం..
ఆర్డినరీ క్లాస్లో 215 కి.మీ. కంటే తక్కువ దూరం ప్రయాణాలకు ఛార్జీలను పెంచలేదు. అలాగే లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. జనరల్ క్లాస్లో 215 కి.మీల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ప్రతి కిలోమీటరకు 1 పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే మెయిల్/ఎక్స్ప్రెస్లోని నాన్-సీ, ఏసీ క్లాస్లో ప్రయాణిస్తే 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ క్లాస్లో 500 కి.మీల ప్రయాణించే వారు, ప్రస్తుతం ఉన్న ఛార్జీలకు అదనంగా మరో రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు సబ్అర్బన్ ట్రైన్ టికెట్ల ధరలను పెంచడం లేదని రైల్వే ప్రకటించింది. ఫలితంగా హైదరాబాద్, కోల్కతా, ముంబయి, దిల్లీలోని లోకల్ ట్రైన్స్లో ప్రయణించే వారిపై ఈసారి భారం పడలేదు.
ఏడాదిలో రెండోసారి
ఈ ఏడాదిలో రైల్వే శాఖ టికెట్ ధరలను పెంచడం ఇది రెండోసారి. జులైలో మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లల్లోని నాన్-ఏసీ టికెట్ ధరలను కిలోమీటరుకు 1 పైసా, ఏసీ క్లాస్ టికెట్ ధరలను కిలోమీటరుకు 2 పైసలు పెంచింది. అంతకుముందు, 2020 జనవరి 1న ట్రైన్ టికెట్ ధరలను రైల్వే శాఖ సవరించింది. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచింది. సబర్బన్ టికెట్ ధరలు, 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఎలాంటి మార్పుల చేయలేదు. 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచింది. ఇక అంతకుముందు 2020 జనవరి 1న టికెట్ ధరలను రైల్వే శాఖ సవరించింది.
10 గంటల ముందే చార్ట్ ప్రిపేర్
ప్రయాణికుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు తయారుచేసే రిజర్వేషన్ చార్టును ఇకపై దాదాపు 10 గంటల ముందుగానే ఖరారు చేసేలా రైల్వే బోర్డు అప్డేట్ చేసింది. దాదాపు 10 గంటల ముందే టికెట్ స్టేటస్ను చెక్ చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అంటే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయల్దేరే రైళ్లకు తొలి చార్టును ముందు రోజు రాత్రి 8 గంటలకు. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు అయితే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బయల్దేరే రైళ్ల తొలి చార్టును కనీసం 10 గంటల ముందు రూపొందించాలని రైల్వే బోర్డు తెలిపింది.

