అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు
ట్రంప్ దురహంకారానికి సరైన గుణపాఠం
ఆయుధ బలం కంటే ప్రజల సంకల్పమే శక్తివంతమని నిరూపణ
అంతర్జాతీయ రాజకీయాలలో ప్రాముఖ్యతను కోల్పోయిన భారత్
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం
కాకతీయ, ఖమ్మం : సామ్రాజ్యవాద అహంకారంతో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలకు గుణపాఠం తప్పదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. బలవంతుడిపై బలహీనుడు చేసిన పోరాటం ప్రపంచానికి పాఠమని పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం బోడేపూడి భవనంలో మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన సిపిఐ ఎం జిల్లా స్థాయి ప్లీనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై దాడులు చేయడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయత్నించాయని విమర్శించారు. చైనా సాంకేతిక సహకారంతో ఇరాన్ సమరశీలతను ప్రదర్శించిందని తెలిపారు.
ప్రజల సంకల్పమే శక్తివంతమైంది..
ఇరాన్ ప్రభుత్వాన్ని ఉంచాలా, దించాలా అన్నది అక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. ఇతర దేశాలకు ఆ హక్కు లేదని స్పష్టం చేశారు. వియత్నాం యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకుని ఆయుధబలం కంటే ప్రజల సంకల్పమే శక్తివంతమని వివరించారు. యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు. చైనా, రష్యా మద్దతుతో ఇరాన్ నిలబడిందని తెలిపారు. నాటో దేశాలు కూడా సహాయ నిరాకరణ చేయడం ఇరాన్కు నైతిక విజయం అని పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యత కోల్పోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల దేశ స్థాయి దిగజారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్, వై విక్రమ్, బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, మడుపల్లి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

