పర్యాటక రంగానికి ప్రాధాన్యం
తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం..
పులిగుండాలలో టూరిజం అభివృద్ధికి రూ. 4 కోట్లు
హరిత నిధి నుంచి రూ. 2 కోట్లు.. సీఎస్ఆర్ నుంచి మరో 2 కోట్లు
పర్యాటకుల కోసం కనకగిరి నుంచి డబుల్ రోడ్డు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఏకో టూరిజం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజవర్గంలోని పులిగుండాల ఏకో టూరిజం ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన కాటేజీలు, బోటింగ్, జంగిల్ సఫారీలను కూడా ఈ సందర్భంగా ఉపముఖ్యతను బట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ప్రసంగంలోనే రాష్ట్రంలో ఏకో-టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలోని కనకగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి బడ్జెట్లోనే నిధులు కేటాయించినట్లు వివరించారు. పులిగుండాల చెరువు వద్ద టూరిజం అభివృద్ధికి రూ. 4 కోట్ల అవసరమని స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ చెప్పారు.

వెంటనే ప్రతిపాధనలు
ఈమేరకు అవసరమైన నిధుల్లో రూ. 2 కోట్ల రూపాయలు హరిత నిధి నుంచి, మిగిలిన 2 కోట్లు రూపాయలను సీఎస్ఆర్ నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు. పర్యాటకుల రాకపోకలకు వీలుగా కనకగిరి నుంచి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. ఈ పనులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ రూపొందించి, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటకులు రావడం వల్ల స్థానిక హోటళ్లు, ఇతర చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రకృతిని ఏమాత్రం దెబ్బతీయకుండా, సహజ సిద్ధమైన వాతావరణంలోనే పర్యాటక అభివృద్ధి జరగాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గొప్ప టూరిస్ట్ స్పాట్
రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రజా ప్రభుత్వం ధృడ సంకల్పంతో ముందుకు వెళుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పులిగుండాల ప్రాజెక్ట్, కనకగిరి గుట్టలు, కల్లూరు గుట్టలను కలిపి ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం కేవలం రాష్ట్రంలోనే కాకుండా, దేశ పటంలోనే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంత అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులను తక్షణమే మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాన్ని మనందరి ఆస్తిగా భావించి, దీనిని అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలకు, దేశానికి గర్వకారణంగా చూపిద్దామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితోపాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెటి శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పీసీసీఎఫ్ అధికారి సువర్ణ, సీసీఎఫ్ భీమానాయక్, ఫీఎఫ్ఓ ఖమ్మం విక్రంసింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

