ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
రైతుకు అండగా రేవంత్ ప్రభుత్వం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
నెల్లికుదురు మండలంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
రోడ్డు కోసం ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్
రహదారికి కొత్త తారు రోడ్డును మంజూరు చేయిస్తామని హామీ
కాకతీయ, నెల్లికుదురు : ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతు సంక్షేమానికి ఎప్పటికీ అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ స్పష్టం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మండలంలోని ఆలేరు గ్రామంలో మొక్కజొన్న మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని, శ్రీరామగిరి, కాచికల్ ఎక్స్ రోడ్, ఎర్రబెల్లి గూడెం, మేచరాజుపల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పంటకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని కోరారు.
రోడ్డు కోసం వేడుకున్న ఫీల్డ్ అసిస్టెంట్
కార్యక్రమం అనంతరం కాచికల్లు నుంచి మేచరాజుపల్లి మీదుగా బూరుగుమడ్ల, పర్వతగిరి, వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితిని తెలియజేస్తూ ఎర్రబెల్లి గూడెం ఫీల్డ్ అసిస్టెంట్ వంగాల సోమయ్య ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుని వేడుకోవడం అక్కడి వారిని కలచివేసింది. రామానుజాపురం, ఎర్రబెల్లి గూడెం, మేచరాజుపల్లి గ్రామాల ప్రజలు కూడా రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, పాడైపోయిన రహదారికి కొత్త తారు రోడ్డును మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. గతంలో రోడ్డు మంజూరుపై ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొంటూ, తాము త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచులు గుండెబోయిన ఉష అశోక్, సుజాత వాసు, ధనమ్మ అమృ, ఉపసర్పంచి సాంబమూర్తి, నాయని పద్మ సత్యపాల్ రెడ్డి, మాదరి ప్రశాంత్, పులి వెంకన్న, శ్రీరామగిరి, నెల్లికుదురు, ఎర్రబెల్లి గూడెం పి ఎస్ సి ఎస్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

