నో స్టాక్!
తెలంగాణలో మరోసారి పెట్రోల్ కొరత
బంకుల వద్ద వాహనదారుల బారులు
పెట్రోల్, డీజిల్ కోసం ఎగబడుతున్న జనం
గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి
సీఎన్జీ కోసం ఆటోలు క్యూ..
ఇంధన కొరతతో పలుచోట్ల బంకులు బంద్
ప్రజల్లో ఆందోళన.. అపోహలొద్దంటున్న అధికారులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాత్రి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో కొన్నాళ్లుగా సీఎన్జీ కొరత కొనసాగుతోంది. సీఎన్జీ కోసం బంకుల ముందు ఆటోలు బారులు తీరాయి. పలు జిల్లాల్లోనూ పెట్రోల్, డీజిల్ దొరకటం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా, డీజిల్కు కొరత ఉంది.
సమస్యను త్వరగా పరిష్కరించాలని వేడుకోలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులు మూసివేశారు. దీంతో ఉద్యోగులు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ పట్టణంలో 12 పెట్రోల్ బంక్లు ఉండగా ఉదయం నుంచి అన్ని బంక్లలో నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో లారీలు, ట్రాక్టర్లు, రైతులు, వ్యాపారులు, క్రషర్ మిల్లులు, వరి కోత, మొక్క జొన్న నూర్పిడి యంత్రాల దారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ వద్ద నిల్వ చేసుకున్న డీజిల్ అయిపోవడంతో వ్యవసాయ, ఆర్ధిక కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు
అపోహలకు గురికావద్దు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్దిగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. రోజుకి 9,574 కిలో లీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 24,000 కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వినియోగదారులకు 2 లక్షల 22 వేలకు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా, గ్యాస్ డెలివరీలపై పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1967 ను సంప్రదించాలని కోరారు.

