చిరు ప్రాయంలోనే.. కొండంత కష్టం!
క్యాన్సర్ మహమ్మారితో మౌనిక పోరాటం
మూడో దశలో వ్యాధి.. చికిత్సకు తప్పని లక్షల వ్యయం
ప్రైవేటు ఉద్యోగాల ఆదాయం సరిపోక దంపతుల అవస్థలు
పసిపిల్లల భవిష్యత్తు తలచుకుని కుమిలిపోతున్న తలిదండ్రులు
దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితురాలి కుటుంబం
కాకతీయ, హన్మకొండ : ఆ దంపతులది ఇద్దరు పసిపిల్లలతో సాగిపోతున్న అందమైన చిన్న ప్రపంచం. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ తమ రెక్కల కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో విధి వారిపై కన్నెర్ర చేసింది. అనూహ్యంగా ఆ ఇంటి ఇల్లాలు మౌనిక (32)ను క్యాన్సర్ మహమ్మారి ఆవహించింది. ఈ పిడుగులాంటి వార్త ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతున్న తీరు, ఆ కుటుంబం పడుతున్న మానసిక, ఆర్థిక వేదన వర్ణనాతీతంగా మారింది.

ఛిద్రమవుతున్న కలల ప్రపంచం
వరంగల్కు చెందిన మధుసూదన్, మౌనిక దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఉన్నంతలో సంతోషంగా ఉన్న ఈ కుటుంబంలో మౌనికకు క్యాన్సర్ సోకడంతో అంతా చీకటిమయమైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఒమేగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి మూడవ దశలో (స్టేజ్-3) ఉండటంతో వైద్యులు తక్షణమే చికిత్స ప్రారంభించాలని, అందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఉన్న కొద్దిపాటి పొదుపును ఇప్పటికే మందులకు, పరీక్షలకు ఖర్చు చేసిన ఆ కుటుంబం.. ఇప్పుడు రాబోయే భారీ ఖర్చును తలచుకుని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
చేయూత కోసం ఎదురుచూపు
వైద్యానికి అయ్యే భారీ వ్యయాన్ని భరించే ఆర్థిక స్తోమత లేక మౌనిక భర్త మధుసూదన్ దాతల సాయం కోసం అర్థరిస్తున్నారు. ఓవైపు భార్య ఆరోగ్య పరిస్థితి, మరోవైపు ఇద్దరు పసిపిల్లల పోషణ భారమై ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. “ఒక చిన్న సహాయం మా కుటుంబాన్ని నిలబెడుతుంది.. నా భార్యను మాకు దక్కించుకుంటుంది” అని ఆయన వేడుకుంటున్నారు. మౌనిక ప్రాణాలను కాపాడేందుకు దాతలు ఉదార హృదయంతో స్పందించాలని కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు మధుసూదన్ నంబర్ 9398711733 కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా నగదు పంపించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

