కాంగ్రెస్ నేతల్లో వణుకు
‘రైతు సంగ్రామ సభ’ విజయవంతంతో ఆగమాగం
రైతు డిక్లరేషన్ అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలం
ఇచ్చిన మాట తప్పడం కాంగ్రెస్ నైజం!
రుణమాఫీపై సవాల్ను స్వీకరిస్తారా?
కాంగ్రెస్ నేతలకు, మంత్రులకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : వరంగల్లో కేటీఆర్ నిర్వహించిన ‘రైతు సంగ్రామ సభ’ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను 900 రోజులు గడుస్తున్నా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేవలం ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకే కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. “బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పుట్టుకను ప్రశ్నిస్తే మొదట ఖండించింది కేసీఆర్. అలాంటి నాయకుడిని విమర్శించడం మహేష్ గౌడ్ అహంకారానికి నిదర్శనం” అని పేర్కొన్నారు. కేటీఆర్ 2009 నుంచి ఎమ్మెల్యేగా, పదేళ్లు మంత్రిగా పనిచేశారని.. కనీసం ఒక్కసారి కూడా గెలవని మహేష్ గౌడ్ తన స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్ తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు.
రుణమాఫీపై బహిరంగ సవాల్
రైతులను మోసం చేసినందుకే కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని వేముల స్పష్టం చేశారు. “రాష్ట్రంలో వంద శాతం రుణమాఫీ జరిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.. దానికి మహేష్ గౌడ్ సిద్ధమా?” అని సవాల్ విసిరారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామన్న హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. వరి పంటకు రూ. 500 బోనస్ ఊసే లేదని, రైతు బంధును కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. కేటీఆర్ మీటింగ్ పెట్టిన ప్రతిసారీ భయంతో ఎకరాల వారీగా నిధులు విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే..
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్పై దాడులకు తెగబడుతున్నాయని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ను అడ్డుకుని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ ‘గూండాలు’ దాడి చేయడం హేయమన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కటయ్యారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 890 మంది రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కె. వాసుదేవ రెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కె. కిషోర్ గౌడ్, ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

