అంత్య పుష్కరాలకు విద్యుత్ ఏర్పాట్లు పూర్తి
18 ట్రాన్స్ఫార్మర్లు, డబుల్ ఫీడింగ్తో సిద్ధం
పుష్కరాల పొడవునా నిరంతరాయ సరఫరా
150 మంది సిబ్బందితో 24 గంటల సేవలు
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రతిష్టాత్మక సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా విద్యుత్ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా చిన్నపాటి అంతరాయం కూడా లేని నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ముందస్తుగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పుష్కరాల ప్రాంగణాలు, ఘాట్ల వద్ద పటిష్ట విద్యుత్ వ్యవస్థ కోసం రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసినట్లు సీఎండీ వివరించారు. 330 ఎనిమిది మీటర్ల స్తంభాలు, 152 తొమ్మిది మీటర్ల స్తంభాలు, 8 పదకొండు మీటర్ల స్తంభాలను నూతనంగా నాటారు. సుమారు 5 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్, 12 కిలోమీటర్ల మేర ఎల్టీ లైన్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. లోడ్ ఇబ్బందులు రాకుండా మొత్తం 18 కొత్త ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చారు.
ఒక ఫీడర్ ఆగినా.. మరో ఫీడర్ ద్వారా సరఫరా!
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన సరస్వతి దేవాలయం, టెంట్ సిటీ, వీఐపీ ఘాట్, మెయిన్ ఘాట్, హరిత హోటల్ తదితర ప్రాంతాలకు ప్రత్యేకంగా ‘డబుల్ ఫీడింగ్’ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. దీనివల్ల సాంకేతిక కారణాలతో ఒక ఫీడర్లో విద్యుత్ సరఫరా ఆగిపోయినా, తక్షణమే సెకండ్ల వ్యవధిలో మరో ఫీడర్ ద్వారా విద్యుత్ అందేలా ప్రత్యామ్నాయం సిద్ధం చేశారు. అత్యవసర బ్రేక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాళేశ్వరం, మహాదేవపూర్, 132 కేవీ కాటారం సబ్స్టేషన్ల వద్ద ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
‘రౌండ్ ది క్లాక్’ విధులు
పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు 16 కీలక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు 150 మంది సాంకేతిక సిబ్బందితో రౌండ్ ది క్లాక్ షిఫ్టుల వారీగా విధులు కేటాయించారు. ఈ బృందంలో 4 మంది డివిజనల్ ఇంజినీర్లు, 6 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు , 13 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు , 12 మంది సబ్ ఇంజినీర్లు, 13 మంది లైన్ ఇన్స్పెక్టర్లు, 9 మంది లైన్మెన్లు, 45 మంది అసిస్టెంట్ లైన్మెన్లు ఉన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని సీఎండీ పేర్కొన్నారు. ఘాట్లు, పూజా మండపాల సమీపంలో విద్యుత్ తీగలు ఉన్న చోట హెచ్చరిక టేపులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తడి బట్టలతో విద్యుత్ స్తంభాలను తాకరాదని, తీగలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యుత్ పరంగా ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.

