ఆదివాసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు!
ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహా మూర్తి
వలస గిరిజనేతరులకు ఆదివాసీ నవనిర్మాణ సేన హెచ్చరిక
వెంకటాపురంలో భారీ రాస్తారోకో.. 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : వలస గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, స్థానిక ఆదివాసీలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి హెచ్చరించారు. వెంకటాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ తలండి రాంబాబు ఇంట్లోకి పట్టపగలే చొరబడి, వలస గిరిజనేతరుడి అనుచరులు ఆయనపైన, ఆయన కూతుర్లపై ఆదివారం దాడికి తెగబడ్డారు. ఈ ఘటనను యావత్తు ఆదివాసీ జాతిపై జరిగిన దాడిగా పేర్కొంటూ ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మంగళవారం సుమారు మూడు వందల మందితో వెంకటాపురం ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనతో రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
అక్రమ నిర్మాణాలపై అధికారుల నిలదీత
ధర్నా స్థలానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ కొప్పుల తిరుపతిరావు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా నిరసనకారులు వినలేదు. దీంతో తహసీల్దార్ వేణుగోపాల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) జుమ్మిలాల్ అక్కడికి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. వలస గిరిజనేతరుడు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ విభాగం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ (ఎల్టీఆర్) కేసు నమోదు చేయాలని తహసీల్దార్ను డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సదరు వ్యక్తి బట్టల దుకాణాన్ని సీజ్ చేయాలని, అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఎంపీడీఓను నిలదీశారు. బాధితుడు రాంబాబుపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు క్రిమినల్ కేసులు బనాయించాలని పోలీసులను కోరారు. ఇప్పటికే నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.
1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
అనంతరం కొర్స నర్సింహా మూర్తి మాట్లాడుతూ మైదాన ప్రాంతం నుండి వలస వచ్చిన గిరిజనేతరుడు రాజమౌళి ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తున్న అక్రమ వ్యాపారాలను తక్షణమే సీజ్ చేయాలన్నారు. వలసవాదులు అధికార పార్టీ అండతో మదమెక్కి ఆదివాసీలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. 1970 తర్వాత ఏజెన్సీకి వలస వచ్చిన గిరిజనేతరులను గుర్తించి వారి సొంత ప్రాంతాలకు పంపించాలని కోరారు. గిరిజన సురక్షా పేదరికం (జీఎస్పీ) రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఐదో షెడ్యూల్ను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా నాయకులు కుంజ మహేష్, జీఎస్పీ జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, వాజేడు మండల అధ్యక్షులు మొడెం నాగరాజు, వాసం నారాయణ, ఇర్ప బాబు, శివ, ఉపసర్పంచ్ కంతి శంకర్, పాయం కిరణ్, మహిళా నాయకులు ముర్రం రామలక్ష్మి, పద్మతో పాటు వెంకటాపురం, వాజేడు మండలాల ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

