లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నాను జయప్రదం చేయండి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మే 25న నిరసన
రూ.9వేల పెన్షన్, సహజ మరణానికి రూ.5 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్
జూలూరుపాడులో టీయూసీఐ ఆధ్వర్యంలో గోడపత్రికల ఆవిష్కరణ
కాకతీయ, జూలూరుపాడు : తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సుదీర్ఘ కాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్లోని రాష్ట్ర లేబర్ కార్యాలయం (కార్మిక శాఖ కమిషనర్ ఆఫీస్) ముందు తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను (పోస్టర్లను) నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో రాత్రింబగళ్లు కష్టపడుతున్న కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.9,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, ఇతర సంక్షేమ పథకాల అమలు బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి రెన్యూవల్ చేసే పద్ధతిని తక్షణమే నిలిపివేయాలన్నారు. ప్రైవేట్ సంస్థలతో కార్మికులకు జరిపిస్తున్న ఆరోగ్య పరీక్షలను రద్దు చేసి, వారందరికీ ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యాన్ని కల్పించాలని స్పష్టం చేశారు.
లేబర్ అడ్డాల వద్ద కనీస వసతులు కల్పించాలి
రైతు బీమా తరహాలోనే భవన నిర్మాణ కార్మికులకు కూడా సహజ మరణం సంభవిస్తే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డులో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతిరోజూ కార్మికులు గుమికూడే లేబర్ అడ్డాల వద్ద నీడ కోసం షెల్టర్లు, చల్లని మంచినీటి వసతి కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకై నిర్వహించే ప్రదర్శన, ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు ఏదులాపురం రాజు, పొరండ్ల కనకమ్మ, రాజమ్మ, నాగరత్నమ్మ, లలిత, భవాని, పట్టా ప్రసాద్, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

