వరంగల్ కమిషనరేట్లో భారీగా పోలీసుల బదిలీలు
కౌన్సిలింగ్ ద్వారా 222 మంది సిబ్బందికి స్థానచలనం
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సన్ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున పోలీసు సిబ్బంది బదిలీలు చోటుచేసుకున్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రభుత్వ నిర్దేశిత కాలపరిమితి పూర్తి చేసిన సిబ్బందిని పరిపాలనా అవసరాలు, పనితీరు, సేవల సమర్థతను దృష్టిలో ఉంచుకుని బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిగా పారదర్శకమైన కౌన్సిలింగ్ విధానంలో సిబ్బంది అభిరుచులు, ఖాళీలు, సేవా అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను నిర్వహించారు. బదిలీల్లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 15 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు (ఏఎస్ఐలు), 160 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 47 మంది కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు. నగరంలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ప్రత్యేక విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికీ ఈ బదిలీలు వర్తించాయి. పోలీస్ శాఖలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టడంపై సిబ్బంది నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించనున్న సిబ్బంది ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సీపీ సూచించారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత అంశాలపై మరింత దృష్టి సారించనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

