కాక్రోచ్ జనతా పార్టీకి షాక్.. అకౌంట్లు క్లోజ్, హ్యాకింగ్!
అభిజిత్ దీప్కే ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
నీట్-యూజీ పేపర్ లీక్పై ఉద్యమం ప్రారంభించిన మరుసటి రోజే దెబ్బ!
ప్రాణాలకు ముప్పు ఉందంటూ వాట్సాప్ బెదిరింపుల స్క్రీన్ షాట్లు షేర్
మా పేరిట వచ్చే ఏ ప్రకటననూ అధికారికంగా భావించవద్దు : దీప్కే
ట్విట్టర్లో పాత వీడియోలు వైరల్..
సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేకి అంటూ ట్రోలింగ్
ఆప్, తృణమూల్ కాంగ్రెస్తో లింకులు..
ఫాలోవర్లంతా పాక్, బంగ్లాదేశ్ వారేనని ఆరోపణలు
కాకతీయ,నేషనల్ డెస్క్ : దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ కేవలం కొన్ని రోజుల్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారిక డిజిటల్ ప్లాట్ఫారమ్లతో పాటు, వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వ్యక్తిగత ఖాతాలపై డిజిటల్ అణిచివేత చర్యలు ఊపందుకున్నాయి. శనివారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాట్లాడుతూ.. తన ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై తీవ్రమైన అణిచివేత చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు, హ్యాకింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ప్రధాన సోషల్ మీడియా అకౌంట్లకు ఎలాంటి యాక్సెస్ లేకుండా పోయిందని ఆయన ప్రకటించారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పూర్తిగా హ్యాక్కు గురైందని స్క్రీన్ షాట్లతో సహా పేర్కొనడం డిజిటల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
నీట్-యూజీ లీకేజీపై ప్రచారం.. ఆ వెంటనే బెదిరింపులు!
దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్-యూజీ 2026’ ఎగ్జామ్ పేపర్ లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం సీజేపీ ఒక దేశవ్యాప్త డిజిటల్ ప్రచారాన్ని (క్యాంపెయిన్) ప్రారంభించింది. ఈ ఉద్యమం ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని, అజ్ఞాత వ్యక్తుల నుంచి వాట్సాప్లో బెదిరింపులు వస్తున్నాయని అభిజిత్ దీప్కే వెల్లడించారు. ఆ బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆయన ఎక్స్లో పంచుకున్నారు. తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కు ప్రస్తుతానికి యాక్సెస్ లేనందున.. ఇకపై “కాక్రోచ్ జనతా పార్టీ” అకౌంట్ల నుంచి వచ్చే ఎలాంటి పోస్టులను లేదా ప్రకటనలను అధికారిక ప్రకటనగా పరిగణించవద్దని, లబ్ధిదారులు, ఫాలోవర్లు జాగ్రత్తగా ఉండాలని దీప్కే స్పష్టం చేశారు.
పాత వీడియోల వైరల్.. పొలిటికల్ లింకులపై విమర్శలు!
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందుతున్న కాక్రోచ్ జనతా పార్టీపై నెటిజన్ల నుంచి విమర్శలు, ఆరోపణలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అభిజిత్ దీప్కే గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా చేసిన పాత వ్యాఖ్యలు, దానికి సంబంధించిన వీడియోలను కొందరు ఎక్స్లో ట్రెండ్ చేస్తూ ‘ట్రోలింగ్’ మొదలుపెట్టారు. మరోవైపు అతడి వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీల హస్తం ఉందని, ఆయా పార్టీలతో దీప్కేకు పక్కా వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీజేపీని ఫాలో అవుతున్న వారంతా భారతీయులు కాదని.. బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన మోస్ట్ వాంటెడ్ అజ్ఞాత శక్తులు, ఉగ్రవాద సానుభూతిపరులేననే బలమైన వాదనను కూడా కొందరు తెరపైకి తెస్తుండటంతో ఈ సరికొత్త డిజిటల్ పార్టీ చుట్టూ వివాదం ముదురుతోంది.

