పురుగులు పరుగులు పెట్టించాయి
ఢిల్లీని కదిలించిన జెన్జీ జోరు!
హేళనగా పుట్టిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’
రోజుల్లోనే దేశవ్యాప్త ఉద్యమంగా మారిన వైనం
సోషల్ మీడియా నుంచి జంతర్మంతర్ వరకు యువత సత్తా
నెలరోజుల పోరాటానికి తలవంచిన కేంద్రం… మంత్రి రాజీనామాతో ముగింపు
యువతను తక్కువ అంచనా వేస్తే రాజకీయ మూల్యం తప్పదు
పాలకులకు స్పష్టమైన హెచ్చరిక చేసిన ఉద్యమం తీరు
కాకతీయ, నేషనల్ డెస్క్ : పురుగులుగా చూసిన వారినే పరుగులు పెట్టించాయి. బొద్దింకలంటూ ఎగతాళి చేసిన ఉద్యమమే చివరకు దేశ రాజకీయాలను కుదిపేసింది. నాలుగు రోజుల్లో చల్లారిపోతుందనుకున్న నిరసన.. నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగి కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో ఒక హేళన వ్యాఖ్యకు ప్రతిస్పందనగా ప్రారంభమైన “కాక్రోచ్ జనతా పార్టీ” అనే యువత ఉద్యమం చివరకు జాతీయ చర్చగా మారింది. యువత ఆగ్రహాన్ని తక్కువ అంచనా వేసిన అధికార వర్గాలు చివరకు వారి డిమాండ్లను అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉద్యమం ప్రధాన డిమాండ్గా మారిన అంశంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజానికి ఇది సంప్రదాయ రాజకీయ ఉద్యమం కాదు. ఎలాంటి పార్టీ జెండా లేదు. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవు. ఒక అవమానకర వ్యాఖ్యతో బాధపడిన యువత సోషల్ మీడియా వేదికగా ఒక్కటైంది. ఆ ఆవేదనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. జంతర్మంతర్ను యువత తమ ఆవేదనకు కేంద్రంగా మార్చుకుంది. అవినీతి, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార అహంకారానికి వ్యతిరేకంగా కొత్తతరం గళమెత్తింది.
నాలుగు రోజుల ఉద్యమమని తీసిపారేశారు
ప్రారంభంలో ఈ ఉద్యమాన్ని పాలక వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు. బొద్దింకల ఉద్యమం అంటూ కొందరు ఎద్దేవా చేశారు. మరో రెండు రోజుల్లోనే చల్లారిపోతుందని అంచనా వేశారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఢిల్లీలో ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఒక్కో రాష్ట్రంలో విద్యార్థులు, యువత వీధుల్లోకి వచ్చారు. విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ యువత కూడా సోషల్ మీడియా ద్వారా సంఘీభావం ప్రకటించింది. దీంతో ఉద్యమం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. మొదట ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, తర్వాత అందులో విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. అనంతరం రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నాయని విమర్శించారు. అయితే యువత మాత్రం తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఉద్యమం రోజురోజుకూ ఉధృతం కావడంతో అధికార వర్గాల స్వరం కూడా మారిపోయింది.
ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజీతో మొదలైన ప్రభంజనం
మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే యువకుడు అమెరికాలో ఉన్న సమయంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో ఒక పేజీ ప్రారంభించాడు. అత్యున్నత స్థాయిలో చేసిన హేళన వ్యాఖ్యకు ప్రతిస్పందనగా ప్రారంభమైన ఆ సోషల్ మీడియా వేదికకు అనూహ్య స్పందన లభించింది. కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది యువత ఆ పేజీకి మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ ప్రచారం ఉద్యమానికి ప్రధాన బలంగా మారింది. డిజిటల్ ప్రపంచంలో మొదలైన నిరసన చివరకు అధికార వ్యవస్థనే కదిలించే స్థాయికి చేరుకుంది. ఈ ఉద్యమం ఒక విషయాన్ని స్పష్టంగా చాటిచెప్పింది. నేటి జెన్జీ యువతను పాత రాజకీయ లెక్కలతో అంచనా వేయడం సాధ్యం కాదు. సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో దేశవ్యాప్తంగా సంఘటితమయ్యే సామర్థ్యం ఈ తరానికి ఉంది. సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా సమస్యలపై స్పందించే ధోరణి పెరుగుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం కోరుతున్న యువతను మాటలతో మభ్యపెట్టే రోజులు ముగుస్తున్నాయనే సంకేతాలు ఈ పరిణామాల్లో కనిపిస్తున్నాయి.
పాలకులకు స్పష్టమైన సందేశం
అధికారంలో ఎవరు ఉన్నా… కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా ప్రజల సమస్యలను తేలిగ్గా తీసుకుంటే భారీ రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే సందేశాన్ని ఈ ఉద్యమం ఇచ్చింది. ముఖ్యంగా యువత ఆవేదనను నిర్లక్ష్యం చేయడం ఇకపై ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదనే వాస్తవాన్ని మరోసారి గుర్తు చేసింది. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ఇప్పుడు కేవలం ప్రచార వేదిక మాత్రమే కాదు… ప్రభుత్వాలను ప్రశ్నించే, నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన ఆయుధంగా మారిందని ఈ పరిణామాలు నిరూపించాయి

