సర్కారు బడులకు కార్పొరేట్ భరోసా!
విద్యాశాఖతో రహేజా , రాంకీ, యశోద ఒప్పందాలు
ఇంటర్ వరకు అత్యాధునిక వసతులతో నూతన ప్రాంగణాలు
రూ.92 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులతో ఉన్నతీకరణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒప్పంద పత్రాలను అందజేత
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు, సర్కారు బడులలో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు ప్రముఖ పారిశ్రామిక, వైద్య సంస్థలు భారీ ఆర్థిక సహాయంతో ముందుకు వచ్చాయి. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర విద్యాభివృద్ధి, నూతన ప్రాంగణాల నిర్మాణం కోసం రహేజా గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్లు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. శనివారం రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఈ మూడు ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రాంకీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోద గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు విద్యాశాఖ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒప్పంద పత్రాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు అండగా నిలిచిన ఈ మూడు సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం ప్రత్యేక అభినందనలు తెలిపింది.
రాంకీ ఆధ్వర్యంలో జవహర్నగర్, తుక్కుగూడ బడుల ఉన్నతీకరణ..
ఈ ఒప్పందాల ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని జవహర్నగర్లో ప్రీ-ప్రైమరీ (నరసరీ) స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు అత్యాధునిక వసతులతో కూడిన కొత్త ప్రాంగణాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయంలో 40 శాతం వాటాగా రూ.19.66 కోట్లను రాంకీ సంస్థ వెచ్చించనుంది. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నతీకరణలో భాగంగా ప్రీ-ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ తరగతుల నూతన ప్రాంగణాల నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం వాటాగా రూ.10.4 కోట్లను రాంకీ సంస్థ వ్యయం చేయనుంది.
కొండాపూర్లో రహేజా రూ.50 కోట్ల భారీ క్యాంపస్..
ఐటీ కారిడార్కు గుండెకాయ లాంటి రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా సరికొత్త ప్రభుత్వ విద్యా ప్రాంగణాన్ని నిర్మించేందుకు రహేజా గ్రూప్ ముందుకొచ్చింది. కొండాపూర్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని రకాల వసతులతో కూడిన తరగతి గదులు, డిజిటల్ ల్యాబ్ల ప్రాంగణ నిర్మాణానికి అవసరమైన మొత్తం రూ.50.50 కోట్ల భారీ నిధులను రహేజా గ్రూప్ పూర్తిగా భరించనుంది.
ఉప్పల్లో యశోద హాస్పిటల్స్ స్మార్ట్ క్లాస్ రూమ్లు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ సుభాష్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి యశోద హాస్పిటల్స్ గ్రూప్ పూర్తి ఆర్థిక భరోసా ఇచ్చింది. ఈ పాఠశాలలో నూతనంగా ప్రీ-ప్రైమరీ విభాగంతో పాటు 6వ, 7వ తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటు కోసం అవసరమైన రూ.12.20 కోట్ల నిధులను యశోద ఫౌండేషన్ వెచ్చించనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని, కోట్ల రూపాయల వ్యయంతో కొత్త భవనాలు నిర్మించేందుకు ఈ సంస్థలు ముందుకు రావడం పట్ల విద్యాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

