కల్తీ విత్తనాలకు చెక్..
రైతులకు నాణ్యమైన విత్తనాలే ప్రభుత్వ లక్ష్యం
నాణ్యమైన విత్తనాల వినియోగానికి ప్రాధాన్యం
వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు మళ్లాలి
ఖరీఫ్ సీజన్కు విత్తనాల కొరత లేదు.. 66 వేల క్వింటాళ్లు సిద్ధం
రెండు జిల్లాల్లో 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి
కాకతీయ, హన్మకొండ: రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఏఆర్ఎస్కే కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు కల్తీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకు నాణ్యమైన విత్తనాల వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
రైతుల ఆదాయం పెరగాలంటే కేవలం వరి సాగుపైనే ఆధారపడకుండా పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను మళ్లించాలని అన్వేష్ రెడ్డి సూచించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో అనుసంధానమై విత్తన ఉత్పత్తి చేపడుతుందని, కఠినమైన ల్యాబ్ పరీక్షల అనంతరం మాత్రమే నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ అధికారిక ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు.
66 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో..
ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్) సీజన్కు ఉమ్మడి జిల్లాల్లో ఎలాంటి విత్తనాల కొరత లేదని చైర్మన్ స్పష్టం చేశారు. మార్కెట్లో సన్న రకాలైన బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, కెఎన్ఎం-1638 తో పాటు దొడ్డు రకాలైన కెఎన్ఎం-118, ఎమ్టియు-1010 విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భూసారాన్ని పెంచే పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలను కూడా రైతులకు సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. ఈ వానాకాలం సీజన్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో సుమారు 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు గాను మొత్తం 66 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వివరించారు.
నూతన విత్తన చట్టం ద్వారా రక్షణ
ఈ మొత్తం అవసరాలలో కనీసం 30 వేల క్వింటాళ్ల అత్యంత నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ రాయితీ మార్గాల ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్వేష్ రెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా అటు రైతుల హక్కులతో పాటు ఇటు నిజాయితీగా పనిచేసే డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం సంపూర్ణంగా పరిరక్షిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, సహకార శాఖ అధికారులు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.

