నిజం ‘నిమ్మల’౦గా బయటకు
మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు
అవినీతి ఎప్పటికైనా బయటపడక తప్పదంటూ మార్కెట్ లో చర్చ
వరంగల్ జిల్లాలో శ్రీనివాస్ హయాంలో అనేక అక్రమాల ఆరోపణలు
సీసీఐ కొనుగోళ్లలో పెద్దమొత్తం అవినీతి జరిగినట్లు విమర్శలు
పంట అంచనాలకు మించి రికార్డుల్లో సరుకు నమోదైనట్లు విచారణలో గుర్తింపు
ఇదే అంశంలో గతంలోనే 105మందికి మెమోలు జారీ.. ఏడుగురు సస్పెన్షన్
తాజాగా, అప్పటి జేడీగా కొనసాగిన ఉప్పల శ్రీనివాస్పైనా చర్యలు
సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ
ఆ 105 మంది వివరణలో చెప్పింది శ్రీనివాస్ పేరేనా?
లేదంటే ఉప్పందించింది ఆ ఏడుగురా?
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వంద తప్పు చేసే దాకా నాడు శిశుపాలుడికి శ్రీకృష్ణుడు సమయం ఇచ్చాడట! నేడు తెలంగాణ మార్కెటింగ్ శాఖలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు నాటి శిశుపాలుడి తీరుకు అద్దం పడుతున్నాయా? అన్నట్లుగా అనిపిస్తోంది. నిజం నిమ్మలంగా బయటపడుతుందన్నట్లుగా సదరు ఉన్నతాధికారి వరంగల్ జిల్లాలో పని చేసిన సమయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అవినీతి ఊడలు పెకిలించే క్రమంలో సదరు అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పుడు మార్కెటింగ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
మార్కెటింగ్ శాఖ మాజీ జేడీపై అవినీతి ఉచ్చు!
ఉప్పల శ్రీనివాస్ వరంగల్ మార్కెటింగ్ శాఖ జేడీగా పని చేసిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సీసీఐ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు అప్పట్లో చర్చ జరిగింది. గుడ్డి పత్తిని కూడా దళారుల ద్వారా కొనిపించి.. సీసీఐ చేత మద్దతు ధర పెట్టించిన బాగోతంలో ఉప్పల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్లు విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, వ్యవసాయ శాఖ అంచనాలకు మించి.. రికార్డుల్లో పత్తి దిగుబడి అయినట్లు చూపడం, ఆ రికార్డుల్లో కొన్ని పత్రాలను మాయం చేసినట్లు అప్పట్లో చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారాన్ని మార్కెటింగ్ శాఖ స్వయంగా గుర్తించి.. రెండేళ్ల క్రితం చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా 105మంది మార్కెటింగ్ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి మెమోలు జారీ కావడం, ఏడుగురు అధికారులు సస్పెన్షన్ కు గురికావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
వారు అందించిన ఉప్పేనా?
ఈ అవినీతి బాగోతం వెనక అప్పటి మార్కెట్ జేడీ ఉప్పల శ్రీనివాస్ హస్తం ఉన్నట్లు అప్పట్లోనే చర్చ జరిగింది. అయితే, ముందస్తుగా మేల్కొన్న ఉప్పల శ్రీనివాస్.. తన మీదకు రాకుండా జాగ్రత్త పడినట్లు ప్రచారం జరిగింది. నిజం నిలకడ మీద బయటకొస్తుందన్నట్లుగా.. తమ వెనక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్లు.. మెమోలు అందుకున్న 105మంది, సస్పెన్షన్కు గురైన ఏడుగురు తమ వివరణలో ప్రభుత్వానికి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే ఆయన్ను జేడీ బాధ్యతల నుంచి తప్పించి.. హైదరాబాద్ కార్యాలయానికి పరిమితం చేసినట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాస్త.. ఆలస్యమైనా చివరకు ఆయనపైనా సస్పెన్షన్ వేటు పడడంతో అసలు అవినీతి బాగోతం బయటపడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే ఆయన వెంట మరికొందరు కూడా ఉన్నారని, వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు కుడిభుజంగా పని చేసిన ఓ గ్రేడ్ 2 కార్యదర్శిపై చర్యలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జేడీఎంగా ఉన్న లక్ష్మణుడు.. సదరు గ్రేడ్ 2ను ఇప్పటికే సాధారణ విధులకు పరిమితం చేసినట్లుగా తెలుస్తుండగా, తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయనే ఆందోళనలో మార్కెట్ వర్గాలు ఉండడం గమనార్హం.

