డ్రగ్ కంట్రోల్లో ఖాకీల సమరం
మాదకద్రవ్యాల నిర్మూలనలో వరంగల్ పోలీసుల ఘనత
రెండేళ్లలో రూ. 8.57 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
192 కేసులు నమోదు.. 403 మంది నిందితుల అరెస్టు
1.24 టన్నుల గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం
యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యం : సీపీ సన్ప్రీత్ సింగ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల కట్టడికి ఏర్పాటు చేసిన ‘డ్రగ్స్ కంట్రోల్ టీమ్’ విశేష ఫలితాలను సాధిస్తోంది. గత రెండేళ్లుగా (15-07-2024 నుండి 16-06-2026 వరకు) చేపట్టిన నిరంతర నిఘా, ప్రత్యేక దాడులతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు చెక్ పెట్టింది.
ఈ కాలంలో పోలీసులు మొత్తం 192 కేసులను నమోదు చేసి, 403 మంది నిందితులను అరెస్టు చేశారు. వీటితో పాటు రూ. 8.57 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా 1,241 కిలోల గంజాయి, 22.4 లీటర్ల హషీష్ ఆయిల్, బ్రౌన్ షుగర్ వంటివి ఉన్నాయి. రవాణాకు ఉపయోగించిన 601 మొబైల్ ఫోన్లు, 63 ద్విచక్ర వాహనాలు, 8 కార్లు, 6 ఆటోలను కూడా పోలీసులు సీజ్ చేశారు.
వ్యసన విముక్తికి ప్రత్యేక సేవలు..
మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని ఆదుకోవడానికి ఎంజీఎం (వరంగల్), నర్సంపేట, జనగామ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పునరావాస కేంద్రాలను (డీ-అడిక్షన్ సెంటర్లు) అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. స్మోకింగ్ కేసుల్లో నిందితులు డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొంది, కోర్టుకు సర్టిఫికెట్ సమర్పిస్తే చట్టం ప్రకారం కేసుల రద్దుకు అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పాఠశాలలు, విద్యాసంస్థల పరిసరాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నారు. సమాజహితం కోసం గంజాయి సాగు, రవాణా, విక్రయాల సమాచారం ఉన్నవారు 8712685299, 8712584473 నంబర్లకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

