రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం
ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం
పంటల కొనుగోలులో నిర్లక్ష్యం.. బోనస్ హామీ బోగస్గా మారింది
22న మడికొండలో బీఆర్ఎస్ శ్రేణులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం
కేసీఆర్ పదేళ్ల పాలనలోనే దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం తగదు
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హన్మకొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు ఆత్మహత్యల దిశగా నెట్టబడుతున్నారని మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ రెండున్నరేళ్ల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రైతులకు జరిగిన అన్యాయంపై నిరంతర పోరాటం
రైతుల పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో పాటు బోనస్ హామీ కూడా బోగస్గా మారిందని దాస్యం వినయ్ భాస్కర్ దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, భారీ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేశారని గుర్తుచేశారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సులు నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ నెల 22న మడికొండలో కేటీఆర్ సభ
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 22న వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), సభ్యత్వ నమోదు ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలకు మడికొండలోని సత్యసాయి గార్డెన్లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు సాధ్యమయ్యాయని, మిషన్ కాకతీయ ద్వారా 42 వేల చెరువుల్లో పూడికతీత చేపట్టడంతో పాటు రైతుబంధు కింద 75 వేల కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదు
రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరానికి నీరు అందించి రైతును రాజుగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. వయసు, అనుభవాన్ని మరిచి చౌకబారు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్వంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజాసేవ కోసం వినియోగించాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు.

