రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రైతుల ఖాతాల్లో లక్ష కోట్లు జమ చేసిన ఘనత బీఆర్ఎస్ దే
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య విమర్శలు
కాకతీయ, పెద్దవంగర: రైతుల ఖాతాల్లో నేరుగా లక్ష కోట్లకు పైగా జమ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పేర్కొన్నారు. నలభై రకాలకు ఉన్న బోనస్ను కేవలం ఏడు రకాలకే కుదించి రైతులను దొంగదెబ్బ తీశారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కష్టకాలంలో 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతుకు కొండంత అండగా కేసీఆర్ నిలిచారని గుర్తు చేశారు. ఆనాడు మద్దతు ధరకు కేవలం వరి ధాన్యమే కాకుండా మొక్కజొన్న, జొన్న, శనగ, కందులు, పెసలు, సన్ ఫ్లవర్, సోయాబీన్ కూడా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వివరించారు. తెలంగాణలో పండే పంటల్లో కేంద్రం కొనుగోలు చేసేది అరకొర మాత్రమేనని, అందులో వడ్లు మూడో వంతు, మిగతా పంటలు కేవలం 25 శాతమేనని తెలిపారు. రాష్ట్ర సర్కారు పంట కొనుగోళ్లలో చేతులెత్తేస్తే ఇక 70 లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు
శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈదురు ఐలయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, సునీల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, ఉపాధ్యక్షుడు వెంకన్న, శ్రీరాం సుధీర్, సుధాకర్, సమ్మయ్య, వెంకన్న, పర్శరాములు, కవిత ప్రదీప్, కవిత యాకన్న తదితరులు పాల్గొన్నారు.

