గురిజాల రైతు వేదికలో సీడ్ మేళా
ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి విత్తనాలకే బోనస్
: ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో గురిజాల రైతు వేదికలో మంగళవారం సీడ్ మేళాను ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి విత్తనాలకే బోనస్ వర్తిస్తుందని, వీటిని అధీకృత డీలర్ల ద్వారా అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. వర్షపాతాన్ని బట్టి మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే పప్పుధాన్యాలు, జొన్న, నువ్వులు, కూరగాయల వంటి ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. యూరియాను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలని, రెండో దఫా నుంచి నానో యూరియా తప్పనిసరిగా వాడాలని రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. రైతులు అంతర పంటలు, తక్కువ నీరు అవసరమైన పంటలను ఎంచుకుంటే నష్టాలు తగ్గుతాయని ఆమె వివరించారు. ఒకే చోట అన్ని విత్తనాలు అందుబాటులో ఉంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలై శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, డీహెచ్వో శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, వ్యవసాయ అధికారి కృష్ణకుమార్, సర్పంచ్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, రైతులు పాల్గొన్నారు.

