నకిలీ స్నాక్స్ గుట్టురట్టు..
‘టాస్క్ఫోర్స్’ మెరుపు దాడి!
అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ తినుబండారాల తయారీ
రూ.లక్షకు పైగా విలువైన పాడైపోయిన నిల్వలు, కెమికల్స్ సీజ్
యజమాని తరమం ఆశీర్వాదం అరెస్టు
కేసును ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగింత
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర పరిధిలోని చింతల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ, నకిలీ స్నాక్స్ తయారీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, నిబంధనలకు విరుద్ధంగా తినుబండారాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న యూనిట్ గుట్టురట్టు చేశారు. అక్కడ నిల్వ ఉంచిన రూ. లక్షకు పైగా విలువైన పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతల్ ప్రాంతంలో ‘మరియా ట్రేడర్స్’ పేరుతో ఓ వ్యక్తి స్నాక్స్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే సదరు కేంద్రంలో ప్రమాదకరమైన, పాడైపోయిన వంటనూనెలను రీ-సైక్లింగ్ చేస్తూ, ప్రభుత్వ అనుమతి లేని కెమికల్ ఫుడ్ కలర్లను వాడుతున్నట్లు టాస్క్ఫోర్స్కు నమ్మకమైన సమాచారం అందింది. దీనిపై స్పందించిన పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఉమ్మడిగా దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో నాణ్యత లేని ఖారా, భోంది, చేకోడి, రసాయనాలతో కూడిన కారం పొడి పెద్ద ఎత్తున లభ్యమైంది. మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 1,06,780 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
నిందితుడిపై కఠిన చర్యలు
అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న యూనిట్ యజమాని తరమం ఆశీర్వాదాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భారీ కల్తీ సరుకుతో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన క్రమశిక్షణా చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ కాలం చెల్లిన, అపరిశుభ్ర ఆహార పదార్థాలను విక్రయించే కేటుగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులు కూడా మార్కెట్లో ఎలాంటి తినుబండారాలు కొనుగోలు చేసినా.. వాటి తయారీ, గడువు తేదీ మరియు నాణ్యత ప్రమాణాలను తప్పక పరిశీలించాలని సూచించారు. ఈ ఆకస్మిక దాడిని టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఎల్. మంగీలాల్, ఎస్ఐ బి. చందర్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక సంయుక్తంగా నిర్వహించారు.

